మళ్ళీ మంత్రులు కాబోతున్నారట.! నిజమేనా.?

మాజీ మంత్రి కొడాలి నానికి మళ్ళీ మంత్రి పదవి దక్కబోతోందట. పేర్ని నాని కూడా ఇంకోసారి ఆ అవకాశం దక్కించుకోనున్నారట. బాలినేని శ్రీనివాస్ రెడ్డినీ అదృష్టం మరోసారి వరించనుందని అంటున్నారు. నిజమేనా ఇదంతా.? ఆయా నేతలు తమ తమ అనుచరులకు ‘మంత్రి పదవుల’ విషయమై చూచాయిగా సంకేతాలు పంపడంతో, ఆయా నియోజకవర్గాల్లో ఆయా నేతలకు అనుకూలంగా సరికొత్త హంగామా షురూ అవుతోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనతోనే ఆయా నేతలకు మరోమారు మంత్రి పదవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుకుంటున్నారట.

అదే నిజమైతే, ఎవరి పదవులు పోతాయ్.? అన్నది కూడా ఆలోచించుకోవాలి మరి.! ఇప్పుడున్న మంత్రుల్లో కొందరు ‘అస్సలు పని చేయడంలేదు’ అన్న వాదన వుంది. ఆ కేటగిరీలోంచి చాలామంది ఔట్ అయిపోవాల్సి వున్నా, కొందరి విషయంలో ప్రత్యేక సానుభూతి చూపిస్తున్నారట ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

ముగ్గురి నుంచి ఐదుగురు వరకు కొత్తగా మంత్రి వర్గంలో చేరతారనీ, ఇప్పటికే మంత్రులుగా వున్నవారిలోంచి ఐదుగుర్ని ‘ఔట్’ చేయబోతున్నారనీ అంటున్నారు. ఔట్ అయ్యే మంత్రుల్లో కొందరు పార్టీ మారేందుకు సిద్ధంగా వున్నారట కూడా. ఏమో, ఈ ప్రచారాల్లో నిజమెంతోగానీ, ఎన్నికలే లక్ష్యంగా మంత్రి వర్గ కూర్పు అన్నది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకునే కీలక నిర్ణయం కాబోతోందన్నది నిర్వివాదాంశం.