ఇంతకాలం తిక్క… మార్చి 14నుంచి దాని లెక్క!

“ప్రజారాజ్యం” మిగిల్చిన చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ.. ఆ పార్టీపై పూర్తి ఆశలు పెట్టుకున్న ప్రజల ఆశలు చిగురింపచేస్తూ.. 2014 మార్చి 14న “జనసేన” ఆవిర్భవించింది. దీంతో… చిరంజీవి పార్టీ పెట్టిన అనంతరం రాజ్యాధికారంపై ఆశలు పెట్టుకున్న ఒక సామాజికవర్గ కోరికకు మళ్లీ జీవం వచ్చినట్లయ్యింది. అది జరిగి అప్పుడే తొమ్మిదేళ్ళ కాలం గడచిపోయింది.

పార్టీ పెట్టిన తొలినాళ్లలో 2014 ఎన్నికలు జరిగాయి. కానీ, జనసేన ఆ ఎన్నికల్లో పోటీచేయలేదు. నాడు బీజేపీ – టీడీపీ కి కూటమికి జనసేన మద్దతిచ్చింది. “నాది భరోసా” అంటూ నాడు టీడీపీ బీజేపీలను గెలిపించడం నాడు పవన్ చేసిన అతిపెద్ద తప్పిదం! ఆ చారిత్రక తప్పిందం తాలూకు మరకలు ఇంకా జనసేన జెండాకు అంటుకునే ఉన్నాయి!

ఇక 2019 ఎన్నికల్లో అధినేత పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీచేసినా… ఫలితం లేకపోయింది. ఆయన గెలవక పోయినా.. పార్టీ గెలిచిన ఒక్కస్థానం కూడా నిలబడకుండా పోయింది!

దీంతో… “సరే.. గతం గతః” అనుకుని ముందుకు కదులుతున్నారు జనసేనాని! అందులో భాగంగా… పార్టీ ఆవిర్భావ సభను మార్చి 14వ తేదీన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భారీ ఎత్తున నిర్వహించాలని ఫిక్సయ్యింది జనసేన! సుమారు 34 ఎకరాల స్థలంలో భారీ జనసందోహం – కార్యకర్తల నినాదాల నడుమ మంగళగిరి పార్టీ ఆఫీసు నుంచి వారాహిపై సభాస్థలికి చేరుకోబోతున్నారు జనసేనాని పవన్!

ఆ సభావేదిక నుంచే… 2024 ఎన్నికల కార్యచరణను ప్రకటించడంతో పాటు… కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను కూడా ప్రకటించబోతున్నారంట. దీంతో… ఇంతకాలం జనసేనాని తిక్కను చూసిన కార్యకర్తలు – మార్చి 14 తర్వాత దాని లెక్క చూస్తారన్నమాట!!