జేడీ లక్ష్మీనారాయణ చేసింది ట్వీట్‌ కాదు… పవన్ కు చురక!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ములాకత్ అయిన అనంతరం పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇంతకాలం తనకు ఆ ఆలోచన లేదు కానీ… తాజాగా వచ్చింది అంటూ టీడీపీతో పొత్తును పవన్ కల్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా ప్రకటించారు.

అయితే ఈ పొత్తు, ఆ ప్రకటన పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఈ రెండు పార్టీలూ కలిసి వెళ్లకపోతే వచ్చే ఎన్నికల్లో చావు దెబ్బ తప్పదని కొందరంటుంటే… పవన్ కు మరో ఆప్షన్ లేదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో జేడీ లక్ష్మీనారాయణ ఒక ట్వీట్ చేశారు. ఇందులో భాగంగా… గుంటూరు శేషేంద్ర శర్మ రచనల్లోని కొన్ని పంక్తులను పోస్ట్ చేశారు.

జనసేనాని పవన్‌ కళ్యాణ్‌.. తనకు ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ అంటే ఇష్టమని చాలాసార్లు చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తరచూ గుంటూరు శేషేంద్ర శర్మ రచనల్లోని కొన్ని పంక్తులను పవన్‌ దాదాపు తన ప్రతి సభలోనూ ఉటంకిస్తుంటారు.

“సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు.. తుపాను గొంతు చిత్తం అనడం ఎరుగదు.. పర్వతం వంగి ఎవడికి సలాం చెయ్యదు.. నేను ఒక పిడికెడంత మట్టే కావచ్చు.. కానీ తల ఎత్తితే ఈ దేశపు జెండాకున్నంత పొగరుంది” అనే పంక్తులను పవన్‌ ప్రతి సభలోనూ చాలా ఉద్వేగంగా చెబుతుంటారు.

ఈ నేపథ్యంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ఈ వాక్యాలను ఉటంకిస్తూ ట్విట్టర్‌ లో ఒక పోస్టు చేశారు. శేషేంద్ర శర్మ ఫోటోతో కూడిన పంక్తులతో ఒక ఫొటోను షేర్‌ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ హాట్‌ టాపిక్‌ గా మారింది. ఉనంపలంగా జేడీ లక్ష్మీనారాయణ చేసిన ఈ ట్వీట్‌ ఖచ్చితంగా పవన్‌ కళ్యాణ్‌ ను ఉద్దేశించేనని పలువురు భావిస్తున్నారు.

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో రిమాడ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న చంద్రబాబు వద్దకు పవన్‌ కళ్యాణ్‌ వెళ్లడం, జైలు నుంచి బయటకొచ్చాక టీడీపీతో పొత్తు ప్రకటించడం లక్ష్మీనారాయణకు నచ్చలేదని టాక్‌ నడుస్తోంది. అందువల్లే ఇలా పవన్‌ తరచూ చెబుతుండే గుంటూరు శేషేంద్ర శర్మ పంక్తుల రూపంలో పరోక్షంగా విమర్శలు సంధించారనే చర్చ జరుగుతోంది.

దీంతో… “సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు” కానీ పవన్ మాత్రం చంద్రబాబు దగ్గరకు వెళ్లారని పలువురు కామెంట్ చేస్తున్నారు.