జగన్ హుందాగా వ్యవహరిస్తున్నాడు…జేసి సంచలనం

 మెలకువలోనే కాదు నిద్రలో సైతం జగన్మోహన్ రెడ్డి పై విరుచుకుపడే సీనియర్ నేత జేసి దివాకర్ రెడ్డి అకస్మాత్తుగా ప్రశంసలతో ముంచెత్తి  ఆశ్చర్య పరిచారు.  జగన్ పై ఏ స్ధాయిలో జేసి బ్రదర్స్ విరుచుకుపడ్దారో అందరూ చూసిందే. అలాంటిది జగన్ ఢిల్లీ పర్యటనలో చాలా హుందుగా వ్యవహరించారని  టిడిపి మాజీ ఎంపి జేసి దివాకర్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

పులివెందుల నుండి వచ్చిన జగన్ ఢిల్లీ పర్యటనలో ఇంత హుందాగా వ్యవహరిస్తారని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు. ప్రత్యేకహోదా గురించి జగన్ చేసిన వ్యాఖ్యలను నూటికి నూరుపాళ్ళు సమర్ధిస్తున్నట్లు చెప్పారు. జగన్ కు తాను భయపడి కితాబివ్వటం లేదని కూడా సర్దిచెప్పుకున్నారు. మొత్తం మీద జగన్ చాలా పరిణతితో వ్యవహరిస్తున్నట్లు కితాబివ్వటం పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

పార్టీ మార్పిడి గురించి మాట్లాడుతూ తనను పార్టీలోకి చేరాల్సిందిగా బిజెపి నుండి ఆహ్వానం అందినట్లు అంగీకరించారు. అయితే తాను బిజెపిలో చేరేది లేనిది ఇపుడే చెప్పలేనన్నారు. ఓటమిపై చంద్రబాబునాయుడు నిజాయితీగా సమీక్షించుకోవాలంటూ సూచించారు.