చంద్రబాబుతో జనసేనాని భేటీ.! ఎందుకో.. ఏమో.!

ముసుగులో గుద్దులాట ఏమీ లేదు.! తెలుగుదేశం పార్టీ – జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నాయి. భారతీయ జనతా పార్టీ కూడా, ఆ రెండు పార్టీలతో కలవక తప్పని పరిస్థితి.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఈక్వేషన్‌కి కారణమవుతున్నారు. నిజానికి, ఈ పరిస్థితిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారన్నది వాస్తవం కాదు.. అసలు కథ వేరే వుంది. ఆ ‘వాక్యూమ్’ సృష్టికర్త టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడే.

2024 ఎన్నికలకు సంబంధించి ఎలా కలసి వెళ్ళాలన్నదానిపై ప్రాథమికంగా చంద్రబాబు – పవన్ కళ్యాణ్ మధ్య చర్చలు జరిగినట్లు ప్రచారం జరిగింది. గత కొద్ది రోజులుగా ఇరువురి మధ్యా రహస్య సమావేశాలు జరుగుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

బీజేపీ నేతలు సుజనా చౌదరి, సీఎం రమేష్.. తెరవెనుకాల ఈ మొత్తం వ్యవహారాల్ని చక్కబెడుతున్నారట.. సంబంధిత సమాచారాన్ని బీజేపీ అధినాయకత్వానికీ చేరవేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే, త్వరలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఇద్దరూ ఢిల్లీకి వెళ్ళవచ్చునట.

కాదు కాదు, బీజేపీ జాతీయ నాయకులే.. హైద్రాబాద్ లేదా విజయవాడకు వచ్చి.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌తో భేటీ అవుతారని ప్రచారం జరుగుతోంది.