జనసేనాని టిక్కెట్లు ఖాయం చేసేస్తున్నారట.!

2024 ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కసరత్తులు ముమ్మరం చేశారు. త్వరలో వారాహితో రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు జనసేన అధినేత శ్రీకారం చుడుతున్న సంగతి తెలిసిందే. కొండగట్టులో ఈ నెల 24 వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆ తర్వాత 30కి పైగా నరసింహ స్వామి దేవాలయాల్ని ‘వారాహి’ని వెంటేసుకుని సందర్శించనున్నారు పవన్ కళ్యాణ్.

తెలంగాణ నుంచి మొదలయ్యే ఈ యాత్ర, ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా జరగనుంది. వారాహి వాహనం సంగతి పక్కన పెడితే, ఏపీలోకి ఎంటర్ అవుతూనే, అభ్యర్థుల్ని ప్రకటించడం మొదలు పెడతారట జనసేనాని. ఇప్పటికే డజను మందికి పైగా నాయకులకు టిక్కెట్లను జనసేన అధినేత కన్ఫామ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

మొత్తంగా 175 నియోజకవర్గాల్లోనూ పోటీ చేసే దిశగా పార్టీ ముఖ్య నేతలకు జనసేన అధినేత ఇప్పటికే సమాచారం ఇచ్చేశారట. ‘అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల్ని నిలబెడుతున్నాం.. పొత్తుల గురించి ప్రస్తుతానికి ఆలోచన లేదు..’ అని జనసేన అధినేత పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేసేశారట.

కాగా, జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఇప్పటికే తనకు టిక్కెట్ కన్ఫామ్ అయిపోయిందని ప్రచారం చేసుకుంటున్నాడట. మొన్నీమధ్యనే రణస్థలం వేదికగా హైపర్ ఆది, రాజకీయ ప్రసంగం చేసి.. పవన్ కళ్యాణ్ మెప్పుని పొందిన సంగతి తెలిసిందే. జనసేనకు సంబంధించి కీలక బాధ్యతలు కూడా హైపర్ ఆదికి (ప్రచారం పరంగా) ఇచ్చే అవకాశ వుందంటున్నారు.

సినీ పరిశ్రమ నుంచి కొందరు నటీనటులు వచ్చే ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసే అవకాశం వుందట. అందులో ఇద్దరు నటీనటులు తెలంగాణ నుంచి పోటీ చేస్తారని సమాచారం.