గేరు మార్చిన జనసేనాని పవన్ కళ్యాణ్.!

పదో పాతికో సరిపోవ్.. ఏకంగా 7‌0.. ఆ పైన సీట్లు కావాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అల్టిమేటం జారీ చేస్తున్నట్లే కనిపిస్తోంది.

వైసీపీ ఎమ్మెల్సీ ఒకరు తాజాగా జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. వైసీపీ ఊహించని పరిణామం ఇది. వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు జనసేన పార్టీతో టచ్‌లోకి వచ్చారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

అయితే, ఆ ఎంపీలు ఎవరన్నదానిపై భిన్న వాదనలున్నాయి. వైసీపీ అధినాయకత్వానికీ ఈ విషయమై ఖచ్చితమైన సమాచారం వుందట. ఇది ఇంకో ట్విస్టు. బుజ్జగింపుల పర్వం నడుస్తోంది. అయినా, జనసేనలోకి వెళ్ళడమేంటి.? అంటూ వైసీపీ అధినాయకత్వం ఆశ్చర్యపోతోంది.

ఇంకోపక్క, ‘మేం ప్రధాన ప్రతిపక్షంగా వున్నాం. మా పార్టీలోకి కదా ప్రజా ప్రతినిథులు రావాల్సింది.?’ అంటూ టీడీపీ కూడా ఆశ్చర్యపోతోంది. కానీ, జనసేనలోకి వలసలు జోరందుకున్నాయి.

జనసేన నుంచి ఎంతమంది వచ్చే ఎన్నికల్లో గెలుస్తారు.? అన్నదాన్ని పక్కన పెడితే, పోటీ చేసేందుకు స్టామినా వున్న అభ్యర్థుల్ని చూపించడం జనసేన ముందున్న తక్షణ కర్తవ్యం. ఆ దిశగానే టీడీపీకి ఝలక్ ఇస్తోంది జనసేన.

ఒక్క దెబ్బకి రెండు పిట్టలన్నట్టు, అటు వైసీపీ కుదేలవుతోంది, ఇటు టీడీపీ కంగారు పడుతోంది. మొత్తానికి జనసేనలో జోష్ కనిపిస్తోంది. కానీ, ఎన్నికల్లో జనసేన గెలిచే సీట్లు ఎన్ని.? ఇదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.

ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జనసేన గౌరవ ప్రదమైన స్కోర్ చేయబోతోంది.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు.