120 చోట్ల జనసేనకు డిపాజిట్లే రాలేదు

ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏదేదో చెప్పారు. కానీ పవన్ చెప్పిందాంట్లో జనాలు దేన్నీ నమ్మలేదు. అందుకనే చిత్తు చిత్తుగా ఓడగొట్టారు. జనసేన తరపున పోటీ చేసిన 136 మంది అభ్యర్ధుల్లో 120 మందికి డిపాజిట్లు కూడా దక్కలేదు. జనసేన అభ్యర్ధులకు పడిన ఓట్లకన్నా చాలా చోట్ల నోటా (నన్ ఆఫ్ ది ఎబో)కు పడిన ఓట్లే ఎక్కువ.

పోటీ చేసిన 136 సీట్లలో గెలిచింది ఒకే ఒక్క సీటైతే రెండో స్ధానంలో నిలబడింది మరో మూడు చోట్ల.  మొత్తం 3.13 కోట్ల మంది ఓటర్లలో జనసేనకు దక్కింది కేవలం 22 లక్షల ఓట్లే.  మొత్తం 13 జిల్లాల్లో జనసేనకు పడిన ఓట్లు కేవలం ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే చెప్పుకోతగ్గ రీతిలో ఉన్నాయి.

టెక్కలి, నరసన్నపేట, సాలురు, గజపతినగరం, మాడుగుల, పాడేరు నియోజకవర్గాల్లో పోటీ చేసిన జనసేన అభ్యర్ధుల కన్నా పై నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్ధులకే ఎక్కువ ఓట్లు రావటం గమనార్హం. అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో ఓటింగ్ సరళిపైన, జనాల తీర్పు పైన జూన్ మొదటివారంలో అభ్యర్ధులతో సమావేశం అవ్వాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు.