కొత్త సర్వే… బీజేపీతో పొత్తు తర్వాత ఏపీలో పరిస్థితి ఇదే!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనూహ్యంగా కొత్త పొత్తు పొడిచిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మరోసారి టీడీపీ.. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఇదే సమయంలో 2014 తరహాలో వీరితో పాటు పవన్ కల్యాణ్ కూడా జతకలిశారు. అయితే అప్పట్లా కాకుండా ఈసారి 21 స్థానాల్లో తనతో పాటు తన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని చెబుతున్నారు. దీంతో… 2014 మ్యాజిక్ రిపీట్ అవుతుందని అంటున్నారు బాబు & కో!

ఇదే సమయంలో... 10 ఏళ్ల క్రితం రాష్ట్ర విడిపోయిన సమయంలో అనుభవం మాటున చంద్రబాబును ప్రజలు గద్దెనెక్కించారని.. అప్పుడప్పుడే మోడీ మేనియా దేశంలో బలంగా వచ్చిందని.. పైగా పవన్ కల్యాణ్ చెప్పిన భరోసా మాటలను కూడా ప్రజలు బలంగా నమ్మారని.. అయితే అది జరిగి 10ఏళ్లు అయ్యింది.. ఎవరి భాగోతం ఏమిటో ప్రజలకు తెలిసింది.. ఈ సారి ఆ ఫలితాలు వచ్చే అవకాశం లేదు.. ప్రజలు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు.

ఆ సంగతి అలా ఉంటే… టీడీపీ – జనసేన కూటమిలో బీజేపీ చేరకముందు, చేరిన తర్వాత ఓటరు నాడి ఎలా ఉందనే విషయాన్ని తాజాగా ఒక సర్వే సంస్థ వెల్లడించింది. ఈ సందర్హంగా ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ ఫలితాల ప్రకారం చూసినా… 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మరోసారి విజయం సాధించడం కన్ ఫాం అని చెబుతుంది. అయితే… 2019 తరహాలో వార్ వన్ సైడ్ మాత్రం కాదని నొక్కి చెబుతుంది. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం…!

ఏపీలో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తున్న వేళ.. టీడీపీ – జనసేన – బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ సమయంలో జన్ మత్ సంస్థ వెల్లడించిన సర్వే ఫలితాల ప్రకారం… 175 స్థానాలకు గానూ వైసీపీకి 119 నుంచి 122 స్థానాల్లో గెలుపు ఖాయమని చెబుతుండగా… టీడీపీ – జనసేన – బీజేపీ కూటమికి 49 నుంచి 51 స్థానాల్లో విజయం కన్ ఫాం అని చెబుతుంది!

ఇక లోక్ సభ సీట్ల విషానికొస్తే… వైసీపీ అత్యధికంగా 19 నుంచి 20 స్థానాల్లో గెలిచే అవకాశం ఉండగా… కూటమికి 5 నుంచి 6 సీట్లు దక్కే అవకాశం ఉందని చెబుతుంది. కాగా… టీడీపీ – జనసేన కూటమితో బీజేపీ కలవక ముందు జరిపిన సర్వేలో ఈ సంస్థ వైసీపీకి 114 నుంచి 117 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని తెలిపింది. దీంతో కూటమిలో బీజేపీ చేరడం వల్ల వైసీపీకి మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుందన్న మాట.