బిజెపితో జగన్ జాగ్రత్తగా ఉండాల్సిందే

బిజెపితో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం జగన్మోహన్ రెడ్డికి వచ్చేసినట్లే ఉంది. చాపక్రింద నీరులా కమలం పార్టీ మెల్లిగా బలోపేతం అవ్వటానికి వ్యూహాలు రచిస్తోంది. మామూలుగా అయితే కమలం పార్టీకి రాష్ట్రంలో ఏమాత్రం బలం లేదు. మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టికి వచ్చిన ఓట్లే నిదర్శనం. అందుకనే బిజెపి నేతలు తమ వ్యూహాన్ని మార్చుకున్నారు.

పార్టీలో ఇపుడున్న సంప్రదాయ నేతల ద్వారా అయితే పార్టీ ఎప్పటికీ బలోపేతం అయ్యే ఛాన్సు లేదని పార్టీ జాతీయ నాయకత్వానికి అర్ధమైపోయింది. అందుకనే ఆపరేషన్ కమలం మొదలుపెట్టింది. వలస నేతలను పార్టీలో చేర్చుకుంటే తప్ప ప్రత్యర్ధులకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం లేదన్న విషయాన్ని గ్రహించింది నాయకత్వం. ఇందులో భాగంగానే ముందుగా టిడిపి నేతలపై దృష్టి పెట్టింది. దాంతో సైకిల్ నేతల్లో చంద్రబాబునాయుడు నాయకత్వంపై నమ్మకం పోయింది. అందుకనే బిజెపిలో చేరుతున్నారు.

ఇప్పటి వరకూ చేరిన వాళ్ళల్లో వరదాపురం సూరి లాంటి ఒకరిద్దరు తప్ప గట్టి నేతలు లేరనే చెప్పాలి. అయితే వచ్చే ఎన్నికల్లో టిడిపి పుంజుకుంటుందా లేదా అన్న విషయాన్ని పక్కనపెడితే బిజెపి మాత్రం ఎంతోకొంత పుంజుకునే అవకాశాలున్నాయి. వలసనేతలను చేర్చుకోవటం వల్ల కమలం పార్టీ బలం వాపా లేకపోతే బలుపా అన్నది ముందు ముందు తేలుతుంది.

ఏదేమైనా టిడిపి కన్నా బిజెపినే డేంజరస్ అని జగన్ గుర్తించాలి. వచ్చే ఎన్నికల్లో బిజెపికి పడే ఓట్లు నరేంద్రమోడి పనితీరుపై ఆధారపడుందన్న విషయం తెలిసిందే.  ఒక్కో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలను అస్ధిరపరిచే వ్యూహాన్ని మోడి-అమిత్ షా ధ్వయం విజయవంతంగా అమలు చేస్తున్నారు. ముందుగా తెలంగాణా తర్వాత ఏపినే వాళ్ళ టార్గెట్ అని అర్ధమవుతోంది. కాబట్టి టిడిపిని దెబ్బకొట్టినంత ఈజీగా జగన్ బిజెపిని దెబ్బకొట్టలేరు. కాబట్టి బిజెపితో జగన్ జాగ్రత్తగా ఉండాల్సిందే.