ఏపీ ప్రజలకు కీలక హామీనిచ్చిన జగన్.. రైతు మరణిస్తే రూ.7 లక్షల పరిహారం

ఆంధ్రప్రదేశ్ లో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నా తన ప్రభుత్వం రూ. 7 లక్షల పరిహారాన్ని అతని కుటుంబానికి అందిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక హామీ ఇచ్చారు. పోలవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కొయ్యలగూడెంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన జగన్, రైతు సంక్షేమానికి దివంగత మహానేత వైఎస్ఆర్ ఎంతో పాటుపడ్డారని గుర్తు చేశారు. రైతులకు ఆర్థిక సాయం విషయంలో తొలి సభలోనే చట్టాన్ని తెస్తామని అన్నారు.

రైతు ఎలా మరణించారని ఎవరూ అడగరని అన్నారు. ఇకపై రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేకుండా చూస్తానని చెప్పారు. రైతులకు అండగా నిలచే ప్రభుత్వం రావాలన్న లక్ష్యం తనదని, ఈ డబ్బుపై ఎవరికీ అధికారం ఉండదని అన్నారు. ప్రజలంతా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు.  పోలవరం ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ తాను అండగా ఉంటానని అన్నారు. నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేసి తీరుతానని చెప్పారు.