నారా లోకేష్ ’యువగళం‘పై వైసీపీకి భయమేల.?

నారా లోకేష్ తలపెట్టిన ’యువగళం‘ పాదయాత్ర, తెలుగుదేశం పార్టీకి మళ్ళీ అధికారం దక్కేలా చేస్తుందా.? పాదయాత్రలు చేసినోళ్ళంతా అధికారంలోకి వచ్చేస్తారని అనుకోలేం. కానీ, తెలుగునాట పాదయాత్ర అంటే అదో సెంటిమెంట్‌లా తయారైందన్నది మాత్రం నిర్వివాదాంశం.

చరిత్రలోకి తొంగి చూస్తే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబునాయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పాదయాత్రలు చేసే అధికారంలోకి వచ్చారన్నది నిర్వివాదాంశం. ఆ కోవలోనే ఇప్పుడు నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభిస్తున్నారు ‘యువగళం’ పేరుతో.

ప్రజాస్వామ్యంలో ఏ మార్గంలో అయినా జనం దగ్గరకు వెళ్ళేందుకు ఏ రాజకీయ నాయకుడికైనా హక్కు వుంది. అలాగే బాధ్యతలు కూడా వుంటాయ్. మారిన పరిస్థితుల నేపథ్యంలో పాదయాత్రలంటే ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడూ, చంద్రబాబు.. జగన్ పాదయాత్రల సమయంలోనూ జనాలకు ఇబ్బందులు తప్పలేదు.

అయితే, రాజకీయాలు మారాయి. అధికారంలో వున్నోళ్ళలో భయాలూ పెరిగాయి. జగన్ పాదయాత్రను అడ్డకునేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం నానా తంటాలూ పడింది. ఇప్పుడు, వైసీపీ ప్రభుత్వం అలాగే నానా తంటాలూ పడుతోందన్నది నిర్వివాదాంశం.

175 నియోజకవర్గాలకుగాను 175 నియోజకవర్గాల్లోనూ గెలిచేస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్న వైసీపీ, లోకేష్ పాదయాత్రతో భయపడాల్సిందేముంది.? డీజీపీ పాదయాత్ర విషయమై కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు. వాటికి వివరణలు ఇచ్చేస్తే సరిపోతుంది. కానీ, సందేహాలు కావవి.. ఆంక్షలని టీడీపీ అంటోంది.

కోర్టుకు వెళితే పాదయాత్రలకు ఎలాగూ అనుమతి వస్తుంది. ఈమాత్రందానికి ఈ లొల్లి అధికార పక్షం నుంచి ఎందుకు.?