పవన్ సెలక్షన్ కరక్టేనా ? ఆశ్చర్యపోతున్న నేతలు

అధికారంలోకి వచ్చేస్తామని అనుకున్న టిడిపి, వైసిపిలే అభ్యర్ధుల ఎంపికలో మల్లగల్లాలు పడుతున్నాయి. అలాంటిది అధికారంలోకి వచ్చే విషయంలో ఎటువంటి అంచనాలు లేని జనసేన మాత్రం ఇద్దరు అభ్యర్ధులను అప్పుడే అధికారికంగా ప్రకటించేశారు. కాకపోతే ఫేస్ బుక్ అధికారిక ఖాతాలో జనసేన అధినేత  పవన్ కల్యాణ్ ప్రకటించటం గమనార్హం. 33 మంది ఎంఎల్ఏలు, తొమ్మిదిమంది ఎంపి అభ్యర్ధులను ప్రకటిస్తామని చెప్పిన పవన్ కేవలం రెండు పేర్లను మాత్రమే ప్రకటించారంతే. అదికూడా రాంగ్ సెలక్షన్ అనే వ్యాఖ్యలు మొదలైపోయాయి.

ఇక పవన్ ప్రకటించిన ఇద్దరు అభ్యర్ధుల వివరాలను చూద్దాం. రాజమండ్రి ఎంపిగా డాక్టర్ ఆకుల సత్యనారాయణను ప్రకటించారు. ఈయన మొన్నటి వరకూ బిజెపి ఎంఎల్ఏ. అమలాపురం ఎంపిగా శేఖర్ ను ప్రకటించారు. శేఖర్ మొన్నటి వరకూ కేంద్రప్రభుత్వ రంగ సంస్ధ ఓఎన్జిసీ సంస్ధలో అధికారి. అంటే రాజకీయాలకు పూర్తిగా కొత్త కాబట్టి ఎవరికీ తెలీదు.

ఆకుల విషయం చూస్తే కాపు సామాజికవర్గానికి చెందిన నేత. కానీ రాజమండ్రి లోక్ సభ పరిధిలో బిసిల ప్రాబల్యం ఎక్కువ. కాబట్టి ఏ పార్టీ అయినా బిసి అభ్యర్ధికే ప్రాధాన్యత ఇస్తారు. అలాంటిది పవన్ మాత్రం కాపు నేతను ప్రకటించటం విచిత్రంగా ఉంది. అదే సందర్భంలో ఓఎన్జీసీలో అధికారిగా పనిచేసిన శేఖర్ ను కూడా ఎన్నికల్లో దింపటం ఎంతమాత్రం సబబుగా లేదు. రాజకీయాల్లో సీనియర్ నేతను ఎన్నికల్లోకి దింపితే అందరికీ తెలిసుంటుంది కాబట్టి కొత్తగా పరిచయటం అవసరం లేదు.

సామాజికవర్గ సమీకరణలు చెప్పటానికి పవన్ ఏమీ రాజకీయాలకు కొత్త కాదు.  పైగా గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తే.  సామాజికవర్గ సమీకరణలన్నది ఏపిలో ఇపుడు బాగా ఎక్కువైపోయింది. కాబట్టి అభ్యర్ధిని నిర్ణయించటంలో అన్నీ జాగ్రత్తలు తీసుకోవలని పవన్ కు కొత్తగా చెప్పక్కర్లేదు. అలాంటిది అన్నీ తెలిసి కూడా రాజమండ్రి అభ్యర్ధి ఎంపికలో తప్పు చేశారంటే ఆశ్చర్యంగా ఉంది. అందులోను అభ్యర్ధే రాజమండ్రికి చెందిన రాజకీయ నేత కావటం గమనార్హం. అంటే హోలు మొత్తం మీద చూస్తు ప్రకటించిన ఇద్దరి అభ్యర్ధిత్వాలపైనా ఎవరికీ పెద్దగా అంచనాల్లేవనే చెప్పాలి.