ప్రజలొద్దంటే నమస్కారం పెట్టేస్తే..ఓటమిని అంగీకరించటమేనా ?

చంద్రబాబునాయుడు తాజా వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయి. మరో 20 రోజుల్లో పోలింగ్ ఉందనగా ఎన్నికల సభల్లో మాట్లాడుతూ తనను ‘ప్రజలొద్దంటే నమస్కారం పెట్టేస్తా’ అని అన్నారంటే అర్ధమేంటి ?  ఒకవైపేమో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీకి 150 + అసెంబ్లీ సీట్లు వస్తాయని చెబుతూనే మరోవైపుమో ప్రజలొద్దంటే నమస్కారం పెట్టేస్తానని అన్నారంటేనే ఓటమిని అంగీకరించినట్లే అని వైసిపి నేతలంటున్నారు.

నిజానికి క్షేత్రస్ధాయిలో టిడిపి పరిస్దితి ఏమంతా బావోలేదు. ఎంపి సీట్లకు పోటీ చేస్తున్న అభ్యర్ధుల్లో చాలామంది ఇష్టం లేకుండానే పోటీలోకి దిగాల్సొచ్చింది. ఇష్టంలేదని చెబుతున్నప్పటికీ  చాలామందిని చంద్రబాబు బలవంతంగా ఎన్నికల బరిలోకి దింపారు. అదేవిధంగా ఎంఎల్ఏ అభ్యర్ధుల్లో చాలామందిపై విపరీతమైన అవినీతి ఆరోపణలున్నాయి.

ఇవన్నీ చూసుకునే మళ్ళీ అధికారంలోకి వచ్చే విషయమై చాలామందిలో నమ్మకం లేదు. ఎన్నికల సభలకు వస్తున్న జనాల స్పందన కూడా అంతంతమాత్రంగానే ఉంది. మరోవైపు టికెట్లిచ్చిన అభ్యర్ధుల్లో కొందరు పోటీనుండి తప్పుకుంటున్నారు. వాళ్ళకి ప్రత్యామ్నాయాలు చూడలేక అవస్తలు పడుతున్నారు. సొంత జిల్లా చిత్తూరులోని పూతలపట్టు నియోజకవర్గంలో బిఫారం ఇచ్చి అభ్యర్ధిపై నమ్మకం లేక చివరి నిముషంలో అభ్యర్ధిని మార్చటం గమనార్హం.

ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో ఇంకా చాలా జరుగుతున్నాయి. వాటన్నింటినీ చూసిన తర్వాత రాబోయే ఎన్నికల్లో బహుశా గెలుపుపై నమ్మకం కోల్పోయినట్లున్నారు చంద్రబాబు. అందుకే ప్రజలొద్దంటే నమస్కారం పెట్టేస్తా అంటూ బేలమాటలు మాట్లాడుతున్నారు. పైగా జగన్, కెసియార్, మోడి కలిసే పోటీ చేస్తే తన సత్తా ఏంటో చూపిస్తానంటూ సవాలు చేయటం విచిత్రంగా ఉంది.