జనసేనకు అజెండా సెట్ చేసిన చంద్రబాబు

అవును ఆ విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. రాబోయే ఎన్నికల్లో అనేక పార్టీలు పోటీ చేస్తున్నాయి. వాటిలో ప్రధానమైనవి మాత్రం  టిడిపి, వైసిపి, జనసేనే అన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో కూడా టిడిపి, జనసేన క్విడ్ ప్రో కో జరుగుతోందని వైసిపి ఆరోపణలు చేస్తోంది. గురువారం విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో చంద్రబాబు మాట్లాడినపుడు క్విడ్ ప్రో కో నిజమే అని స్పష్టంగా తెలిసిపోయింది.

మిగిలిన అన్నీ ప్రసంగాల్లాగే చంద్రబాబు ప్రసంగంలో ఇక్కడ కూడా కొత్తదనం ఏమీలేదు. వివేకానందరెడ్డి మర్డర్ అంశం, జగన్, కెసియార్, మోడి త్రయం గురించి మాట్లాడారు. ముగ్గురు కక్ష కట్టి రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు మండిపడ్డారు. జనాలకు సంబంధం లేని విషయాలు మాట్లాడి సానుభూతి పొందాలని ప్రయత్నించారు.

జగన్ హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉంటారంటూ పదే పదే విమర్శలు చేస్తున్న చంద్రబాబు తన సొంతిల్లు ఎక్కడున్నదో మరచిపోయినట్లున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతైన  జగన్  లోటస్ పాండ్ లోనే కాదు అమరావతి పరిధిలో కూడా బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నారు. మొన్ననే గృహప్రవేశం కూడా చేశారు.  మరి చంద్రబాబు సొంతిల్లు ఎక్కడ కట్టుకున్నారు ?

సరే ప్రస్తుత విషయంలోకి వస్తే చంద్రబాబు మాట్లాడుతూ, అక్రమాస్తుల కేసులో జగన్ ను జనసేన నిలదీయాలని చెప్పారు. జనసేన తరపున విశాఖపట్నం ఎంపిగా పోటీ చేస్తున్న సిబిఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణ జగన్ అక్రమాస్తుల కేసులను జనాలకు వివరించాలని చెప్పారు. ఎందుకంటే కేసులను విచారించింది లక్ష్మీనారాయణేనట. అంటే రేపటి నుండి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ లేకపోతే లక్ష్మీనారాయణ ఎక్కడ మాట్లాడినా జగన్ అక్రమాస్తుల కేసుల గురించే మాట్లాడాలన్నమాట. చూద్దాం మరి లక్ష్మీనారాయణ ఏం మాట్లాడుతారో ?