టిడిపి ముణగటంలో జనసేన పాత్ర కూడా ఉందా ?

అలాగనే చెప్పుకుంటున్నారు ఇపుడు తెలుగుదేశంపార్టీ నేతలు. వైసిపి విజయావకాశాలను దెబ్బ తీయటానికి చంద్రబాబునాయుడు జనసేన అధినత పవన్ కల్యాణ్ ను రంగంలోకి దింపారన్న విషయం బహిరంగ రహస్యమే. కాపు సామాజికవర్గం ఓట్లు కావచ్చు లేదా పవన్ అభిమానుల ఓట్లు కావచ్చు వైసిపి అభ్యర్ధులకు పడకుండా ఓట్లు చీల్చాలన్నది చంద్రబాబు ఉద్దేశ్యం.

నిజానికి ఒంటిరిగా పోటీ చేసేంత సీన్ జనసేనకు లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఎంత పొత్తులు పెట్టుకున్నా జనసేన దాదాపు 130 అసెంబ్లీ నియోజకవర్గాల్లోను 20 పార్లమెంటు సీట్లకు పోటీ చేసింది. గెలుపు సంగతి పక్కనపెడితే అసలు డిపాజిట్లు ఎంతమందికి వచ్చిందన్నది ప్రధాన ప్రశ్న. అయితే దాదాపు 36 నియోజకవర్గాల్లో మాత్రం జనసేన అభ్యర్ధులకు పెద్ద ఎత్తున ఓట్లు వచ్చాయి.

ఈ 36 నియోజకవర్గాల్లో గెలిచిన  వైసిపి అభ్యర్ధుల మెజారిటీకన్నా జనసేనకు పోలైన ఓట్లే ఎక్కువ. శ్రీకాకుళంలో వైసిపి అభ్యర్ధికి వచ్చిన మెజారిటి 4813 ఓట్లు. అయితే ఇక్కడ జననసేకు వచ్చిన ఓట్లు 7440. కాకినాడ సిటిలో వైసిపి అభ్యర్ధికి 14,111 ఓట్లొస్తే జనసేనకు 30188 ఓట్లు వచ్చాయి. పిఠాపురంలో వైసిపి మెజారిటీ  14992 ఓట్లు అయితే జనసేనకు వచ్చిన ఓట్లు 28011.

పి గన్నవరంలో 22027 ఓట్ల మెజారిటి వైసిపికి వస్తే జనసేనకు పడిన ఓట్లు 36259.  భీమవరంలో వైసిపికి వచ్చిన మెజారిటి 16605 అయితే జనసేనకు 62285 ఓట్లు వచ్చాయి. అవనిగడ్డలో వైసిపికి 20725 ఓట్ల మెజారిటీ వస్తే జనసేనకు 28556 ఓట్లు వచ్చాయి. మంగళగిరిలో వైసిపికి వచ్చిన మెజారిటీ 5300 అయితే జనసేన(బిఎస్పి)కు పడిన ఓట్లు 6726. ఇలా మొత్తం 36 నియోజకవర్గాల్లో జనసేనే తమ కొంప ముంచిందని టిడిపి నేతలు లబోదిబో మంటున్నారు. ఏదో చేద్దామని చంద్రబాబు అనుకుంటే ఇంకేదో అయి చివరకు టిడిపినే ముంచిదన్నమాట.