మోడితో ఢీ అంటున్న జగన్

నరేంద్రమోడిని ఢీ కొట్టటానికే జగన్మోహన్ రెడ్డి రెడీ అయిపోయారు. త్రిపుల్ తలాక్ బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చలో బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టంగా ప్రకటించారు. తాజాగా జగన్ తీసుకున్న స్టాండ్ తో మోడితో కయ్యానికే జగన్ మొగ్గు చూపుతున్నట్లుగా అర్ధమైపోతోంది.

లోక్ సభలో నెగ్గిన ఈ బిల్లు రాజ్యసభలో నెగ్గటం బిజెపికి అత్యంత ప్రతిష్టగా మారింది. ప్రస్తుత పరిస్ధితుల ప్రకారమైతే రాజ్యసభలో అవసరమైనంత బలం బిజెపికి  లేదు.  అందుకనే ప్రాంతీయ పార్టీల మద్దతు కోసం అవస్తలు పడుతోంది. ఇందులో భాగంగానే బిజెపి చీఫ్ అమిత్ షా వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడినట్లు సమాచారం.

అయితే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై బాగా అసంతృప్తిగా ఉన్నారు జగన్. అదే సమయంలో రాష్ట్రంలో ఓటు బ్యాంకును కూడా దృష్టిలో పెట్టుకున్నారు. బిజెపికి  వైసిపి మద్దతిచ్చినా ఇవ్వకపోయినా ఏపి ప్రయోజనాల విషయంలో కేంద్ర వైఖరిలో మార్పు అయితే లేదని జగన్ కు అర్ధమైపోయింది.

అందుకనే త్రిబుల్ తలాక్ బిల్లుపై బిజెపికి మద్దతిచ్చి రాష్ట్రంలోని ముస్లింలను ఎందుకు దూరం చేసుకోవాలని జగన్ ఆలోచించారట. దానికితోడు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి జగన్ కు మంచి మిత్రుడే. కాబట్టే బిజెపి ప్రవేశపెట్టిన బిల్లును వ్యతిరేకించాలని జగన్ నిర్ణయించారు. జగన్ తీసుకున్న నిర్ణయంతో మోడి ఢీ కొట్టటానికే జగన్ ప్రిపేర్ అయినట్లు అర్ధమవుతోంది. కాకపోతే బిల్లును పూర్తిగా వ్యతిరేకించకుండా చివరినిముషంలో ఓటింగ్ ను బహిష్కరించింది వైసిపి.