సింగపూర్ కంపెనీలకు జగన్ షాక్  ?

సింగపూర్ కంపెనీలకు షాక్ ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్లు అర్ధమవుతోంది. రాజధాని నిర్మాణానికి స్విస్ ఛాలెంజ్ పద్దతిలో చంద్రబాబునాయుడు సింగపూర్ లోని కొన్ని సంస్ధలతో ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం అందిరకీ తెలిసిందే. కుదుర్చుకున్న ఒప్పందాలేమిటి ? అన్న విషయాన్ని మాత్రం చంద్రబాబు బయటపెట్టలేదు. ఎంతమంది ఎన్నిరకాలుగా అడిగినా ఒప్పందాల వివరాలను చెప్పటానికి చంద్రబాబు ఇష్టపడలేదు.

సరే ప్రభుత్వం మారింది కదా. అందుకనే స్విస్ ఛాలెంజ్ తో పాటు సింగపూర్ కంపెనీలకు కూడా జగన్ షాక్ ఇవ్వటానికి రెడీ అయినట్లు కనబడుతోంది. టెండర్లు, కాంట్రాక్టు పనుల్లో పారదర్శకత కోసం జ్యుడీషియల్ కమీషన్ ను తీసుకురావటానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. ఆ జ్యుడీషియల్ కమీషన్ గనుక ఏర్పాటైతే ఇతర కాంట్రాక్టుల్లాగే సింగపూర్ కంపెనీలతో కుదర్చుకున్న కాంట్రాక్టులు కూడా కమీషన్ పరిధిలోకి వచ్చేస్తుంది.

ఒకసారి కమీషన్ పరిధిలోకి వస్తే ఇక రహస్యం అనేది దాదాపు ఉండదు. అపుడు సింగపూర్ కంపెనీలతో కుదుర్చుకున్న రహస్య ఒప్పందాలన్నీ బట్టబయలవుతాయి. స్విస్ ఛాలెంజ్ ముసుగులో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలున్న విషయం అందరికీ తెలిసిందే. ఒప్పందాలు బయటపడితే అందులోని అవినీతి కూడా జనాలకు తెలుస్తుంది. కాబట్టి అప్పుడు సింగపూర్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలు రద్దయ్యే అవకాశాలున్నాయి.

నిజానికి స్విస్ ఛాలెంజ్ విధానం మనదేశంలో విఫల ప్రయోగం. అందుకనే కోర్టులు కూడా ఈ పద్దతి వద్దని స్పష్టంగా చంద్రబాబుకు చెప్పింది. అయినా మాజీ సిఎం ఒప్పుకోలేదు. సరికదా సింగపూర్ కంపెనీలతో మరిన్ని కాంట్రాక్టులు కుదుర్చుకోవటంతో మొత్తం వ్యవహారమే కంపైపోయింది. మరిపుడు జగన్ ఈ సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాల్సిందే.