హాట్ టాపిక్: కన్నా ఫ్యాన్ కిందికి చేరితే..?

బీజేపీకి రాజినామా చేసిన క్షణం నుంచి కన్నా లక్ష్మీనారాయణ ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయిపోయారు. రాజీనామా చేస్తూ చేస్తూ.. అటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహరావులపై పలు విమర్శలు చేసిన ఆయన.. తాను బీజేపీని వీడటానికి వీరిద్దరే కారణం అని చెప్పకనే చెప్పారు! ఆ సంగతి అలా ఉంటే… ఇప్పుడు కన్నా ఏ పార్టీలో చేరబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది.

అవును… బీజేపీ నుంచి బయటకు వచ్చేసిన సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఏపార్టీలో చేరతారనేది ఇప్పుడు ఏపీలో మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. తన సామాజిక వర్గం నాయకుడు స్థాపించిన పార్టీకి తన సీనియారిటీతో సాయం చేస్తారా? లేక, తనపై మోజుపడుతున్నాట్లుగా – తాను మోజుపడుతున్నట్లుగా కథనాలొస్తున్న టీడీపీ వైపు వెళ్తారా? అనే ప్రశ్నల నడుమ “వైకాపా వైపు ఎందుకు వెళ్లకూడదు”? అనే ప్రశ్న తాజాగా నెట్టింట హల్ చల్ చేస్తుంది!

అవును… కన్నా లక్ష్మీనారాయణకు వైఎస్సార్ అంటే అమితమైన ఇష్టం. వైఎస్సార్ కూడా కన్నా ను ఆ స్థాయిలోనే దగ్గర చేసుకోవడం, తన కేబినెట్ లో స్థానం కల్పించడం.. అత్యంత చనువుగా ఉండటం తెలిసిందే. ఈ క్రమంలో.. మధ్యలో జరిగిందంతా ఒక పీడకలలా భావించి.. తన అభిమాన నాయకుడి కుమారుడితో కన్నా ప్రయాణం ఎందుకు సాగించకూడదు? ఇప్పుడు కన్నా అభిమానుల్లో కొత్తగా మొదలైన ఆలోచన ఇది!

నిజంగా జగన్ పార్టీ పెట్టిన కొత్తల్లోనే కన్నా, వైకాపాలో చేరి ఉంటే… నేడు ఆయన పరిస్థితి మరోలా ఉండేది! కానీ, కాలం గాలం వేసి కన్నా కొన్ని చారిత్రక తప్పిదాలు చేశారని ఆయన ఫ్యాన్స్ ఇప్పుడు ఫీలవుతున్నారు. ఇదే సమయంలో.. “ఇప్పటికైనా మించిపోయింది లేదు.. మీ అభిమాన నాయకుడి కుమారుడితో కలిసి నడిస్తే బెటర్” అని కన్నాకు, కొందరు కార్యకర్తలు సలహాలు కూడా ఇస్తున్నారట!

ఆ కొంతమంది ఫ్యాన్స్ కోరుకుంటున్నట్లుగా కన్నా లక్ష్మీనారాయణ, ఫ్యాన్ కిందకి చేరితే మాత్రం.. రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లోని సామాజిక సమీకరణల్లో పెను మార్పులే జరుగుతాయని అంటున్నారు విశ్లేషకులు! మరి… కన్నా లక్ష్మీనారాయణ తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సిందే!!