తెలంగాణలో మంత్రి పదవులు ఎవరిని వరించనున్నాయో అని అంతా ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యేలైతే ఉత్కంఠగా ఉన్నారు. ఎవరిని మంత్రి పదవి వరిస్తుందో, కేసీఆర్ మదిలో ఎవరున్నారో, ఎవరికి ఏ శాఖ దక్కుతుందో అన్న చర్చ జరుగుతోంది. 18 వ తేదినే మంత్రులను ఎంపిక చేసి, అదే రోజు మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తోంది. అయితే కేసీఆర్ మంత్రుల ఎంపికను సామాజిక వర్గాల వారీగా కసరత్తు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎస్సీ కోటాలో మంత్రి పదవికి ఐదుగురు పోటి పడుతున్నారని చర్చ జరుగుతోంది. ఆ ఐదుగురు ఎవరంటే…
డిప్యూటి సీఎంగా ఉన్న కడియం శ్రీహరి మంత్రి పదవికి పోటి పడుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరి గత ప్రభుత్వంలో డిప్యూటి సీఎంగా, విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించారు. ఈ సారి కేబినేట్ లో కడియం శ్రీహరికి మంత్రి పదవి దక్కేనా లేదా అనే చర్చ ప్రజలల్లో, పార్టీ కార్యకర్తల్లో జరుగుతుంది. కడియం శ్రీహరిని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మల్యే అభ్యర్ధిగా ప్రకటించాలని అభిమానులు ఆందోళన నిర్వహించారు. అయినా కూడా కేసీఆర్ కడియంకు అవకాశం ఇవ్వకుండా మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యకు అవకాశం ఇచ్చారు.

కడియం శ్రీహరి లెక్చరర్ గా పని చేశారు. ఎన్టీ రామారావు సూచనతో కడియం రాజకీయాలలోకి వచ్చారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా, తొమ్మిదిన్నర సంత్సరాలు మంత్రిగా కడియం శ్రీహరి పనిచేశారు. ఎన్టీఆర్ , చంద్రబాబు కేబినేట్ లో కడియం శ్రీహరి మంత్రిగా పని చేశారు. కేసీఆర్ కేబినేట్ లోను మంత్రిగా పని చేశారు. కేసిఆర్ కేబినేట్ లో కడియంకు మరోసారి అవకాశం దక్కుతుందా లేదా అనే అనుమానం అందరిలో మొదలైంది.

ధర్మపురి నుంచి గెలుపొందిన కొప్పుల ఈశ్వర్ కూడా మంత్రి పదవి రేసులో ఉన్నాడు. కొప్పుల ఈశ్వర్ బిఏ వరకు చదువుకున్నారు. సింగరేణి కార్మికునిగా పని చేశారు. ఆరు సార్లు కొప్పుల ఈశ్వర్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004 లో తొలిసారి ఎమ్మెల్యేగా మేడారం నుంచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఉద్యమ సమయంలో పలుసార్లు రాజీనామా చేసి గెలుపొందారు. ప్రభుత్వ చీప్ విప్ గా కూడా కొప్పుల ఈశ్వర్ పని చేశారు. ప్రస్తుతం మంత్రి పదవి కోసం కొప్పుల ఈశ్వర్ కూడా పోటి పడుతున్నారు.

వర్ధన్న పేట నుంచి శాసన సభ్యుడిగా ఎన్నికైన ఆరూరి రమేష్ కూడా మంత్రి పదవికి పోటి పడుతున్నారు. ఆరూరి రమేష్ గత కేబినేట్ లోనే మంత్రి పదవి కోసం పోటి పడ్డారు. కానీ దక్కలేదు. ఈ సారి ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ నుంచి ఆరూరి రమేష్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆరూరి రమేష్ కేటిఆర్ కు సన్నిహితుడు. ఖచ్చితంగా ఆరూరి రమేష్ కు ఈ సారి కేబినేట్ లో అవకాశం దక్కుతుందనే ఆశతో కార్యకర్తలు ఉన్నారు. ఆరూరి రమేష్ కూడా తన సాన్నిహిత్యం ద్వారా మంత్రి పదవి కోసం పెద్దలతో చర్చ జరుపుతున్నట్టు తెలుస్తోంది.

మానకొండూర్ నుంచి రసమయి బాలకిషన్ రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రసమయి కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారని తెలుస్తోంది. రసమయి బాలకిషన్ ఉద్యమ సమయంలో తన పాటలతో ప్రజానికాన్ని చైతన్యపరిచారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో రసమయికి కూడా దళిత సామామరో జిక వర్గం కోటాలో సీటు దక్కుతుందనే ఆశలో కార్యకర్తలు ఉన్నారు.

మంత్రి పదవి కోసం పోటి పడుతున్న నాయకుడు బాల్క సుమన్. బాల్క సుమన్ 2014 లో పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. ఎంపీగా ఉంటూనే చెన్నూరు నుంచి అసెంబ్లీకి పోటి చేసి విజయం సాధించారు. బాల్క సుమన్… కేసీఆర్ కు నమ్మకస్తుడు, విదేయుడిగా పేరుంది. కేసీఆర్ కుటుంబం అంతా కూడా సుమన్ అని పేరు పెట్టి పిలుస్తారు. బాల్క సుమన్ కు కేసీఆర్ కుటుంబంతో చక్కని అనుబంధం ఉంది. బాల్క సుమన్ కు కేసీఆర్ ఆశీస్సులు నిండుగా ఉన్నాయని పార్టీలో చర్చించుకుంటారని తెలుస్తోంది. బాల్క సుమన్ కు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందనే చర్చ జరుగుతోంది. \
ఈ ఐదుగురిలో మంత్రి పదవి ఎవరిని వరించనుందో అనే ఉత్కంఠ అందరిలో మొదలైంది. ఈ వర్గం నుంచి ఇద్దరికి అవకాశం ఇస్తారనే చర్చ కూడా జరుగుతోంది. మరి మంత్రి పదవులు ఎవరిని వరించనున్నాయో, ఎవరు అదృష్ట వంతులవుతారో చూడాలి.
