టీడీపీ ఎంపీలకు షాక్ ఇచ్చిన జీవీఎల్

టీడీపీ నేతలకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. రాజ్యసభలో తన ప్రసంగం తర్వాత తనను బెదిరించారని, ఖబడ్ధార్ అంటూ..తీవ్ర పరిణామాలుంటాయన్న టీడీపీ నేతల హెచ్చరికను వీడియో ఆధారాలతో రాజ్యసభ కార్యదర్శికి సమర్పించారు జీవీఎల్. టీడీపీ వైఫల్యాలను ఎండగట్టడంతోనే బెదిరించారంటూ ఆరోపించారు బీజేపీ నేత జీవీఎల్.

రాజ్యసభలో విభజన హామీలపై వాడివేడిగా సాగిన చర్చలో పాల్గొన్న బీజేపీ ఎంపీ జీవీఎల్ టీడీపీ పై పలు విమర్శలు చేశారు. ప్యాకేజీని స్వాగతిస్తూ చంద్రబాబు చేసిన పలు తీర్మానాలను ఆయన చదివి వినిపించారు. ప్యాకేజీకి మద్దతు పలికిన చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేకహోదా కోసం ఎలా డిమాండ్ చేస్తారని ప్రశ్నించారు. కేంద్ర పధకాలను తమ పథకాలుగా టీడీపీ ప్రచారం చేసుకుంటుందని ఆయన విమర్శించారు. ఈ విమర్శలు చేస్తున్నప్పుడే టీడీపీ నేతలు ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చైర్మన్ వెంకయ్యనాయుడు జోక్యం చేసుకుని వారిని వారించటంతో వెనక్కి తగ్గారు తెలుగు తమ్ముళ్లు.

రాజ్య సభలో తన ప్రసంగం తరవాత టీడీపీ నాయకులు తనపై బెదిరింపులకు పూనుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జీవీఎల్ నరసింహారావు. ఖబడ్ధార్, తీవ్ర పరిణామాలుంటాయని టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యల క్లిప్పింగులతో సహా, సభ హక్కుల ఉల్లంఘన నోటీసును రాజ్యసభ కార్యదర్శికి అందించినట్టు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. కార్యదర్శికి అందించిన లేఖను కూడా ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

 

https://platform.twitter.com/widgets.js