ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ సారథ్యంలో ఏర్పాటైన జనసేన పార్టీకి ఎన్నికల సంఘం ఉమ్మడి గుర్తు కేటాయించింది. దేశవ్యాప్తంగా కొత్తగా నమోదైన 29 పార్టీలకు వివిధ గుర్తులను కేటాయించిన ఈసీ.. పవన్ జనసేనకు ‘గాజు గ్లాసు’ గుర్తును కేటాయిస్తూ శనివారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది.
వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నట్టు పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ‘గాజు గ్లాసు’ గుర్తుతోనే బరిలోకి దిగనున్నారు. జనసేనకు ఎన్నికల సంఘం గుర్తు ప్రకటించిన వెంటనే ఆ పార్టీ ట్విట్టర్ ఖాతా ద్వారా జనసేన కార్యకర్తలు, అభిమానులతో ఆ విషయాన్ని పంచుకున్నారు.

జనసేన పార్టీకి ఎన్నికల గుర్తు కేటాయించడంతో పార్టీ శ్రేణులు జోష్ లో ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో జరగనున్న ఎన్నికలలో జనసేన పార్టీ బరిలోకి దిగుతుంది. ఏపీ బాగుపడాలంటే జనసేన అధికారంలోకి రావాలని పవన్ ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. వివిద పార్టీల నుంచి నేతలను కూడా జనసేనలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు కీలక నేతలు జనసేనలో చేరారు. ఆ ఇద్దరు నేతలు వివిధ నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. దీంతో జనసేన తన ఎన్నికల వ్యూహాన్ని ప్రారంభించింది. జనసేనకు ఎన్నికల గుర్తు రావడంతో ఇక దూకుడుగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎన్నికల గుర్తు రావడంతో పవన్ ఫ్యాన్స్, జనసేన సైనికులు ఫుల్ జోష్ లో ఉన్నారు.
