వైసిపిలోకి గట్టి నేత..8న ముహూర్తం

కర్నూలు జిల్లాలో బనగానిపల్లి నియోజకవర్గంలో గట్టి పట్టు కలిగిన మాజీ ఎంఎల్ఏ చల్లా రామకృష్ణారెడ్డి వైసిపిలో చేరుతున్నారు. ఈనెల 8వ తేదీన లోటస్ పాండ్ లో జగన్మోహన్ రెడ్డిని కలిసి వైసిపి కండువ కప్పుకోనున్నారు. టిడిపిలో ఉన్న చల్లా స్ధానిక వర్గ విభేదాలతో పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.  

స్ధానికంగా ఎంఎల్ఏ వర్గంతో చల్లాకు పడటం లేదు. ఆ విషయాన్ని చంద్రబాబునాయుడుతో చెప్పినా ఉపయోగం కనబడలేదు. దాంతో టిడిపిలో ఉండి ఉపయోగం లేదనుకున్నారు. అందుకనే టిడిపికి రాజీనామా చేసేశారు. నాలుగుసార్లు ఎంఎల్ఏగా గెలిచిన చల్లాకు నియోజకవర్గంలో బాగానే పట్టుంది.

అయితే టిడిపి ఎంఎల్ఏ బిసి జనార్ధనరెడ్డితో ఏమాత్రం పడటం లేదు. అదే సమయంలో షెడ్యూల్ ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్నాయి కద. అందుకనే పార్టీని వదిలిపెట్టి వైసిపిలో చేరాలని అనుకున్నారు. వైసిపిలో కూడా చల్లాకు టికెట్ విషయంలో జగన్ హామీ ఇవ్వలేదని సమాచారం. అయినా వస్తున్నారంటే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా సముచిత స్ధానం వస్తుందన్న ఆశతోనే కావచ్చు.