టిడిపిలో 25 మంది ఎంఎల్ఏలు రెడీగా ఉన్నారా ?

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడుకు షాక్ తప్పేట్లు లేదు. ఎందుకంటే, షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడేకొద్దీ టిడిపిలో నేతలు, సిట్టింగ్ ఎంఎల్ఏలతో పాటు కొందరు మంత్రులు కూడా పక్క చూపులు చూస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం చాలామంది సిట్టింగుల్లో లేదట. మరికొంత మందికేమో టిక్కెట్లు దక్కుతాయన్న నమ్మకం పోయిందట. అందుకే ముహూర్తం చూసుకుని టిడిపిలో నుండి బయటకు దూకేందుకు రెడీ అవుతున్నారని మాజీ మంత్రి పెద్ద బాంబే పేల్చారు.

 

బిజేపి నేత తాడేపల్లి గూడెం ఎంఎల్ఏ, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ మళ్ళీ గెలిచే అవకాశాలు లేవని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇదే విషయమై పార్టీలో పెద్ద చర్చే జరుగుతోందట. అందుకనే మంత్రులు, సిట్టింగ్ ఎంఎల్ఏలు సుమారు 25 మంది ఇతర పార్టీల్లోకి జంప్ చేయటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు చెప్పారు. అయితే అందరూ ఏ పార్టీల్లోకి జంప్ చేస్తారని మాత్రం పైడికొండలు చెప్పలేదు లేండి.

 

ఎందుకంటే, అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం టిడిపిలో నుండి బయటకు వచ్చేద్దామనుకుంటున్న వాళ్ళంతా అయితే వైసిపి లేకపోతే జనసేన వైపే చూస్తున్నారట. ఆ తర్వాత మాత్రమే బిజెపిని ఆప్షన్ గా పెట్టుకున్నట్లు సమాచారం. పైడికొండల స్వయంగా బిజెపి నేత అయ్యుండి టిడిపిలో నుండి బయటకు వచ్చేసే వాళ్ళంతా వైసిపి, జనసేన వైపు చూస్తున్నారని బహిరంగంగా చెప్పలేరు కదా ? అందుకనే ఆ విషయాన్ని మాత్రం చెప్పలేదు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, పైడికొండలు కూడా కాపు సామాజికవర్గానికి చెందిన నేతే. పైగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో మంచి సంబంధాలున్న నేత. అందులోను పశ్చిమ గోదావరి జిల్లా వాసి. రాష్ట్రం మొత్తం మీద కాపుల ప్రాబల్యం ఎక్కడన్నా ఉందంటే ఎక్కువగా ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రమే. అందుకనే పవన్ కూడా జనసేన బలోపేతానికి ఉభయగోదావరి జిల్లాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. కాబట్టి తప్పదంటూ పైడికొండలు కూడా జనసేనలోకి దూకేసినా ఆశ్చర్యం లేదని సమాచారం. చూద్దాం పైడికొండలు చెప్పిన ఎప్పటికి జరుగుతుందో.