అధికార పార్టీని ఇప్పుడే లక్ష్యంగా చేసుకోరట..టిడిపికంత సీనుందా ?

కిందపడ్డా తమదే పై చేయన్నట్లుగా ఉంది టిడిపి నేతల బడాయి. ఏదో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అయిపోయింది తెలుగుదేశంపార్టీ పరిస్ధితి మొన్నటి ఎన్నికల్లో. మొత్తం 175 నియోజకవర్గాల్లో వైసిపి 151 నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. టిడిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏల్లో చాలామంది ఏదో అదృష్టం కొద్ది గెలిచారంతే. అలాంటి వాళ్ళల్లో మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఒకరు.

ప్రచారం సందర్భంలోనే నిమ్మకాయలను పెద్దాపురం నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లోకి అసలు ప్రచారానికే అడుగు పెట్టనీయలేదు జనాలు. జనాలను కాదని కొన్ని గ్రామాల్లోకి నిమ్మకాయల అడుగుపెట్టినా ప్రచారం చేసుకోనీయలేదు. ఆ వీడియోలన్నీ అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి.

అలాంటిది ఇపుడు జగన్మోహన్ రెడ్డికి నిమ్మకాయల కన్సెషన్ ఇస్తున్నట్లుగా మాట్లాడుతున్నారట. అధికార పార్టీని అప్పుడే లక్ష్యంగా చేసుకోనని ఏదో అభయం ఇస్తున్నట్లుగా ఫోజులు కొడుతున్నారు.  వైసిపి పాలన ఎలాగుందో ముందు చూస్తారట. తప్పులుంటే ఎత్తి చూపుతారట.

అప్పటికేదో జగన్ కు నిమ్మకాయల ఎంతో మేలు చేసేస్తున్నట్లు మాట్లాడుతున్నారు.  విషయం ఏదైనా సరే మొన్నటి ఐదేళ్ళల్లో అసెంబ్లీలో కానీ బయటకానీ  చంద్రబాబునాయుడు అండ్ కో  జగన్, వైసిపి విషయంలో  వ్యవహరించినట్లే ఇపుడు వైసిపి కూడా వ్యవహరిస్తే టిడిపి సంగతి అంతే సంగతులు.