కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పిన సీనియర్ నాయకుడు కనుమూరు రవిచంద్రా రెడ్డి శుక్రవారం ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను కలిశారు. ఆయన సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. రవిచంద్రా రెడ్డితో పాటు హరిచంద్రా రెడ్డి, ఆయన అనుచరులకు జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
కనుమూరు సోదరులు పార్టీలో చేరడంతో నెల్లూరు జిల్లాలో తమ పార్టీ మరింత బలోపేతమైందని వైఎస్ఆర్ సీపీ నాయకులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి బావ రామకోట సుబ్బారెడ్డి, ఆయన కుమారులు, అనుచరులు రెండు రోజుల కిందటే వైఎస్ఆర్ సీపీలో చేరారు.
తాజాగా అదే జిల్లా నుంచి రవి చంద్రారెడ్డి చేరడం పార్టీకి ప్లస్ పాయింట్. ఆ జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. వాటిల్లో ఏడింటిని వైఎస్ఆర్ సీపీ హస్తగతం చేసుకుంది. ఆ తరువాత గూడూరు ప్రతిపక్ష ఎమ్మెల్యే సునీల్కుమార్ పార్టీ ఫిరాయించారు. టీడీపీలో చేరారు.
