అంతర్వేదిలో కొత్త రథంతోనే రథోత్సవం .. మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్ !

అంతర్వేదిలో 2021 ఉత్సవాలు, రథోత్సవం కొత్త రథంతోనే నిర్వహిస్తామని భక్తులకు ఇచ్చిన హామీని సీఎం వైఎస్‌ జగన్‌ నెరవేర్చారు. అంతర్వేదిలో రథం దగ్థౖమైన తర్వాత ఐదు నెలల్లో అన్ని హంగులతో కొత్త రథం నిర్మాణం పూర్తయ్యింది. నేటి నుంచి ప్రారంభమయ్యే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలకు కొత్త రథాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు.

YS Jagan Antarvedi visit: జగన్ హామీ ఇచ్చినట్టే అంతర్వేదిలో కొత్త రథంతోనే రథోత్సవం, కాసేపట్లో ప్రారంభించనున్న సీఎం

కల్యాణోత్సవాలు, కొత్త రథాన్ని ప్రారంభించేందుకు సీఎం కాసేపట్లో అంతర్వేదికి చేరుకుంటారు. గంట పాటు స్వామి సేవలో గడపనున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఉదయం 11.20 గంటలకు అంతర్వేది ఫిషింగ్‌ హార్బర్‌ వద్ద హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 11.35 గంటలకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రాజగోపురం వద్దకు చేరుకుని 11.35 నుంచి 11.45 మధ్య స్వామి దర్శనం, అర్చన, మంత్రపుష్పం సమర్పణ కార్యక్రమాలను సీఎం నిర్వహిస్తారు. అనంతరం రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. 12 గంటలకు శ్రీలక్ష్మీనరసింహస్వామి రథాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 1.30కి తాడేపల్లికి చేరుకుంటారు.

గతేడాది సెప్టెంబర్‌ 5న అంతర్వేదిలో రథం దగ్ధం అయ్యింది. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. ఈ ఘటన జరిగిన వెంటనే సీఎం స్పందించారు. కొత్త రథంతోనే ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు. రథం దగ్ధం కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రతిపక్షాల ఆరోపణలకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు.