తాడేపల్లి: ఎపీ సీఎం క్యాంప్ ఆఫీస్లో ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్స్(EMC) ,గ్రామాల్లో డిజిటల్ లైబ్రెరీల ఏర్పాటుపైన అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… యువతకు ఉన్నత ఉద్యోగాల కల్పనే ఐటీ పాలసీ ముఖ్య లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఐటీ కాన్సెప్ట్ తో సిటీలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలలో కాన్సెప్ట్ సిటీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీలో ఏర్పాటయ్యే కంపెనీలకు ప్రతి ఏటా ఇన్సెంటివ్లు చెల్లిస్తామన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ను బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు.
ఈ ఏడాది చివరికల్లా సుమారు 4వేల గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలకు మంచి సామర్థ్యం ఉన్న ఇంటర్నెట్ను తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కడప సమీపంలోని కొప్పర్తి వద్ద నిర్మిస్తున్న వైయస్సార్ ఈఎంసీ ప్రగతిపై ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందించారు. అక్టోబరులో ముఖ్యమంత్రిచే ప్రారంభోత్సవం చేయించేలా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు.