తొక్కుకుంటూ పోవాలె.! చంద్రబాబు రాజకీయమిదే.!

ఏం రాజకీయమిది.? ఏదన్నా ఓ ఘటన జరిగి జనం ప్రాణాలు పోతే, ఇంకోసారి అలాంటి కార్యక్రమాన్ని నిర్వహించే విషయమై ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. కానీ, తగ్గేదే లే.. అంటున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు. జనం చచ్చిపోతే తమకేంటి.? అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

ప్రతిపక్షం గనుక, టీడీపీ చేపట్టే కార్యక్రమాలకు అనుమతి నిరాకరణ విషయమై కొన్ని ఇబ్బందులు పోలీసు శాఖకీ వుంటాయ్. ప్రభుత్వం విపక్షాలపై కుట్రపూరిత చర్యలనేవి ఎప్పటినుంచో నడుస్తున్న వ్యవహారమే. ఆ రాజకీయాలు మళ్ళీ వేరు.

కానీ, తమ వల్ల 8 ప్రాణాలు పోయాయన్న సోయ కనీసం టీడీపీ అధినేత చంద్రబాబుకి లేకుండా పోయింది. ఫలితం మరో మూడు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయ్. ‘మా సభలకు జనం పోటెత్తుతున్నారు..’ అని చెప్పుకుంటున్న చంద్రబాబు, ఇకపై ‘మా వల్ల ఇదిగో, ఇన్ని ప్రాణాలు పోయాయ్.. ఇదీ మా ఘనత’ అని చెప్పుకుంటారేమో నిస్సిగ్గుగా.

రాజకీయ పార్టీలు రాజకీయ కార్యక్రమాలు నిర్వహించుకోవడం తప్పు లేదు. వాటికి జనాన్ని రప్పించాలనుకోవడాన్నీ తప్పు పట్టలేం. కానీ, ప్రజా భద్రత విషయంలో రాజీ పడితే ఎలా.? టీడీపీకి ఈ విషయమై పటిష్టమైన ‘ప్రైవేటు యంత్రాంగం’ వుంది. సభల నిర్వహణలో టీడీపీ ‘ఆర్గనైజింగ్ స్కిల్స్’ గురించి కొత్తగా చెప్పేదేముంది.?

ఎక్కడో తేడా కొడుతోంది. వరుసగా రెండు దురదృష్టకర ఘటనలు చోటు చేసుకున్నాయి. అయినా, టీడీపీ నేతల్లో కించిత్ బాధ కనిపించడంలేదు. బహుశా ‘తొక్కుకుంటూ పోవాలె’ అనే నినాదానికి చాలా బలంగా కట్టుబడి వున్నట్టుంది టీడీపీ.