బీసీలకు మళ్లీ తప్పుడు హామీలు… తలలు పట్టుకుంటున్న తమ్ముళ్లు!

చంద్రబాబు మారారేమో అని అనుకున్న ప్రతీసారి… మరింత పాతాళానికి దిగిపోతున్నారని అంటున్నారు టీడీపీ కార్యకర్తలు. ఈసారైనా పూర్తిగా వాస్తవాలు మాట్లాడుకుంటూ… నెరవేర్చగలిగే హామీలే ఇచ్చుకుంటూ… జరిగే విషయాలే నేతలకు చెప్పుకుంటూ ముందుకు వెళ్లాలని… అలాకానిపక్షంలో మరో 2019 ఫలితం ఎదురయ్యే ప్రమాధం ఉందని.. ప్రజలు బాగా అడ్వాన్స్ అయ్యారని.. ఏది నిజమో ఏది అబద్ధమో ఐదునిమిషాల్లో గ్రహించగలుగుతున్నారని మొత్తుకుంటున్నారట. దానికి కారణం… బాబు బీసీ సమాజానికి కొత్తగా ఇచ్చినహామీ!

అవును… ఏమాత్రం ప్రాక్టికల్ గా సాధ్యం కాని హామీని చంద్రబాబు తాజాగా బీసీలకు ఇచ్చారు. అదేమిటయ్యా అంటే… వచ్చే ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం బీసీ కులాలకు టికెట్లు కేటాయిస్తారట! 2011 సెన్సెస్ లెక్కల ప్రకారమే తీసుకున్నా… విభజిత ఏపీలో సుమారుగా 49 – 51శాతం బీసీ జనాభా ఉంటారు! సరే… మధ్యలో సరాసరిన 50% బీసీ జనాభా ఉన్నారన్ని భావించినా… ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో… 87 నుంచి 88 టిక్కెట్లు ఒక్క బీసీలకే ఇవ్వాలి. ఇది ప్రాక్టికల్ గా సాధ్యమో కాదో… చంద్రబాబుకు తెలియంది కాదు.

ఇదే క్రమంలో… ఈ 87-88 స్థానాలు నిజంగా బీసీలకు ఇస్తే… బాబు నిజంగా గొప్పపని చేసినట్లే. వాటితో పాటు కచ్చితంగా ఇవ్వాల్సిన 36 రిజర్వుడ్ స్థానాలు (29 ఎస్సీ, 7 ఎస్టీ) ఎలాగూ ఉన్నాయి. మొత్తం కలిపి… 124 స్థానాలు అవుతాయి. అంటే… ఎస్సీ – ఎస్టీ – బీసీలకు రాబోయే ఎన్నికల్లో టీడీపీ 124 స్థానాలు ఇవ్వాలన్నమాట. ఇది తనకు సాధ్యం కాదని చంద్రబాబుకు తెలుసు…! అయినా కూడా ఇప్పటికీ బీసీలను ఏమార్చేపనికి పూనుకుంటూనే ఉన్నారు బాబు!

బాబు బీసీల విషయంలో ఇలాంటి కబుర్లు చెబుతున్నారనే… వారంతా 2019 ఎన్నికల సమయంలో జగన్ కు జై కొట్టారని వాపోతున్నారు తమ్ముళ్లు. దీంతో… నిజంగా ఈసారి బాబు మారారని నమ్ముతున్న వాళ్లు సైతం… ఈ ఒక్క స్టేట్ మెంట్ తో… “బాబు మారలేదని, మారబోరని, పైగా ఇది ఇంక మారేవయసు కూడా కాదని” ఒక క్లారిటీకి వచ్చేస్తున్నారు.

కాగ… 2014లో సీఎం అయిన తర్వాత బీసీ సంఘాల నేతలతో గొడవలు పడి నోటికొచ్చినట్లు మాట్లాడారు చంద్రబాబు. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వాళ్ళని తోకలు కత్తిరిస్తానని.. అందరిముందు అవమానంగా మాట్లాడారు. దాంతో బీసీల్లో చీలిక వచ్చి 2019 ఎన్నికల్లో చంద్రబాబు తోకనే కత్తిరించేసిన సంగతి తెలిసిందే!