YSRCP-BJP: తెలంగాణలో బీజేపీ, తెలంగాణ రాష్ట్ర సమితిని టచ్ చేసేసింది. టచ్ చేయడమేంటి.? గులాబీ పార్టీని దెబ్బతీస్తోంది కూడా. తెలంగాణలో బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు. అందులో ఇద్దరు ఉప ఎన్నికల వల్ల గెలిచినవారే. ఆ పార్టీకి చెప్పుకోదగ్గ స్థాయిలో ఎంపీలు కూడా వున్నారు.
మరి, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితేంటి.? ఒక్క ఎమ్మెల్యే లేరు.. ఒక్క ఎంపీ కూడా లేరు. అలాంటప్పుడు ఏ మొహం పెట్టుకుని ఏపీలో బీజేపీ రాజకీయాలు చెయ్యగలదు.? రాజకీయ కుట్రలెలా చెయ్యగలుగుతుంది.? టీడీపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యుల్ని లాక్కోగలిగిందిగానీ, అంతకు మించి బీజేపీ ఏమీ చేయలేకపోయింది.
నిజానికి, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుని బీజేపీ తమవైపుకు తిప్పుకోవచ్చు. ఆయనతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకీ వెళ్ళొచ్చు. కానీ, అంత రిస్క్ తీసుకోవడంలేదు బీజేపీ. సమీప భవిష్యత్తులోనూ ఏపీలో బీజేపీ, వైసీపీ టచ్ చేసే సీన్ లేదు.
అయితే, ఇప్పుడు తెలంగాణ.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్.. అంటూ బీజేపీ కొనుగోళ్ళ వ్యవహారంపై కేసీయార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఇలా ఏపీ మఖ్యమంత్రిని అలర్ట్ చేయడం వెనుక కారణమేంటన్నదానిపై ఆసక్తికరమైన విశ్లేషణలు జరుగుతున్నాయి. జగన్, కేంద్రంతో సన్నిహితంగా వుంటున్నారు గనుక, వైసీపీకి వచ్చిన సమస్య ఏమీ లేదు.
అసలు బీజేపీని ధిక్కరించాల్సిన అవసరం వైసీపీకి ఏంటి.? ప్రత్యేక హోదా సహా ఏ విషయంలోనూ కేంద్రాన్ని నిలదీయడమే మానేసింది వైసీపీ. సో, ఏపీలో బీజేపీ నుంచి వైసీపీకి ఎలాంటి థ్రెట్ వుండబోదు.
