బురఖాల పంచాయితీ.! వైసీపీకి అవసరమా.?

సెల్ఫ్ గోల్.. హిట్ వికెట్.. ఇలాంటి వాటి మీద ప్రయోగాలెందుకు చేస్తోంది ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీ.? బురఖా అనేది సెంటిమెంట్.! ఆషామాషీ సెంటిమెంట్ కాదు.. చాలా సీరియస్ వ్యవహారం ఇది. ముస్లిం మహిళలకు బురఖా చాలా చాలా సీరియస్ అంశమే కదా మరి.!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహిస్తున్న బహిరంగ సభల వద్ద బురఖాలు ధరించే మహిళలకు ఆంక్షలున్నాయన్నది గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం. నల్ల దుస్తులు ధరించి, ముఖ్యమంత్రి బహిరంగ సభలకు రావొద్దంటూ అధికారులు హుకూం జారీ చేస్తున్నమాట వాస్తవం.

ఆయా బహిరంగ సభల వద్ద ఈ నిబందనని ఖచ్చితంగా అమలు చేస్తున్నారు కూడా. ఈ వ్యవహారంపై పెద్దయెత్తున రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఇలాంటి అంశాల్ని నిజానికి, చాలా సున్నితంగా డీల్ చేయాలి. విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడాలి. తమ తప్పుల్ని సరిదిద్దుకోవాలి. అధికారులు సంయమనం పాటించేలా చర్యలూ తీసుకోవాలి. కానీ, ఇవేవీ జరగడంలేదు.

విషయం ముదిరి పాకాన పడింది. ‘మేం.. ఎందుకు ముఖ్యమంత్రి సభలకు వెళ్ళకూడదు.?’ అని ముస్లిం మహిళలు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు, బురఖా తీసేసి లోపలికి వెళ్ళడమా.? ఇదేం పద్ధతి.? అని మండిపడుతున్నారు. దాంతో, వైసీపీ డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగింది.

మీటింగుల్లో బురఖాలు వేసుకున్న మహిళలు, విద్యార్థినులు వుంటున్నారు.. వారి మీద ఎలాంటి ఆంక్షలూ లేవంటూ వైసీపీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా వివరణ ఇచ్చుకుంటున్నారు. కానీ, డ్యామేజ్ అయితే గట్టిగానే జరిగిపోయింది. ఈ విషయంలో వైసీపీ, జస్ట్ హిట్ వికెట్.. సెల్ఫ్ గోల్ అంతే.!