కర్నూలు బాలసాయిబాబా గుండెపోటుతో మంగళవారం ఉదయం 11 గంటలకు మరణించారు. అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ బంజారహిల్స్ లోని విరించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. గత నాలుగేళ్లుగా బాలసాయిబాబా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. క్యాన్సర్ చికిత్స తీసుకుంటుండగానే గుండెపోటు రావడంతో ఆయన మరణించారు. 1960 జవనరి 14 న బాలసాయిబాబా జన్మించారు. 18 ఏళ్ల వయసులోనే ఆయన ఆశ్రమాన్ని స్థాపించారు.
శివరాత్రి నాడు తన నోటి నుంచి శివలింగాలు తీస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. తనదైన ప్రవచనాలతో భక్తులను ఆయన విశేషంగా ఆకట్టుకునేవారు. బాలసాయి మృతి వార్త విని ఆయన అనుచరులు కంటతడి పెట్టారు. ఆయన పేరిట కర్నూలు ప్రాంతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు సాగుతున్నాయి. బాలసాయిబాబా పలు సంధర్భాల్లో ఈ వ్యాఖ్యలు చేశారు.
“నేను ఏంటనేది నాకే తెలియదు. వజ్రం ఎప్పుడూ వజ్రం అనుకోదు. నేను దేవుడినే అయితే మనమిద్దరం ఇక్కడ కూర్చుండే వాళ్లమే కాదు. కలిస్తే స్వర్గంలో కలవాలి లేక దేవలోకంలో కలవాలి. అంటే అర్థమేమిటి. మనిషి చావు గురించి మాట్లాడుతారు. కానీ చావు తరువాత ఇలా ఉంటుందని చెప్పిన వాడు లేడు. చచ్చిపోయి తిరిగి వచ్చిన వాడు లేడు. కాబట్టి వాటి గురించి మాట్లాడుకోవడం వృథా. పదిమందికి మంచి చేసే వాడే దేవుడు.” అని బాల సాయి బాబా చెబుతుండేవారు.
బాల సాయి బాబా పై పలు ఆరోపణలు కూడా ఉన్నాయి. పేద, అమాయకుల నుంచి వేల ఎకరాలు స్వాధీన పరుచుకున్నారని పలువురు మహిళలతో సంబంధాలు కూడా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. విదేశాల నుంచి చందాలు వసూలు చేసి కూడగట్టుకున్నారనే వాదనలు కూడా ఉన్నాయి.