Byreddy Shabari: పీఏ మృతితో కన్నీటిపర్యంతమైన ఎంపీ బైరెడ్డి శబరి

Byreddy Shabari: నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి వ్యక్తిగత సహాయకులు (PA) రాజేష్ నాయుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. గత 20 ఏళ్లుగా బైరెడ్డి కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడిగా మెలిగిన రాజేష్ మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. విషయం తెలిసిన వెంటనే ఢిల్లీ నుంచి హుటాహుటిన కర్నూలు చేరుకున్న ఎంపీ శబరి, రాజేష్ పార్థివ దేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు.

ప్రమాదం జరిగిందిలా..
సోమవారం అర్ధరాత్రి సమయంలో రాజేష్ నాయుడు బైక్‌పై కర్నూలుకు వస్తుండగా ప్రమాదం సంభవించింది. బైక్ అదుపు తప్పి కింద పడిపోవడంతో, అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఆయనపై నుంచి దూసుకెళ్లింది. ఈ తీవ్ర ప్రమాదంలో రాజేష్ నాయుడు (39) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

20 ఏళ్ల అనుబంధం.. రాజేష్ నాయుడు కేవలం ఒక ఉద్యోగిగానే కాకుండా, బైరెడ్డి కుటుంబంలో ఒక సభ్యుడిగా కలిసిపోయారు. మొదట బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వద్ద పీఏగా ప్రస్థానాన్ని ప్రారంభించిన రాజేష్, సుదీర్ఘకాలం ఆయన వెంటే ఉన్నారు. ప్రస్తుతం ఎంపీ బైరెడ్డి శబరి వ్యక్తిగత సహాయకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాయలసీమ హక్కుల పోరాటాల్లోనూ, గత ఎన్నికల సమయంలోనూ శబరి గెలుపు కోసం ఆయన ఎంతో శ్రమించారు.

ఎమోషనల్ అయిన ఎంపీ శబరి
రాజేష్ మృతదేహాన్ని సందర్శించిన ఎంపీ బైరెడ్డి శబరి ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. రాజేష్ నాయుడు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె సామాజిక మాధ్యమాల్లో ఒక భావోద్వేగపూరితమైన సందేశాన్ని పోస్ట్ చేశారు.

“ఎన్నో ఏళ్లుగా మా కుటుంబంతో కలిసి ప్రయాణిస్తూ, నాన్నకు, నాకు చేదోడువాదోడుగా ఉంటున్న రాజేష్ నాయుడు మనల్ని విడిచి వెళ్లిపోయారనే వార్త నన్నెంతో కలచివేసింది. ఇది నా కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్లే ఉంది. ఆయన లోటు ఎప్పటికీ భర్తీ చేయలేనిది.”- నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి.

తరలివచ్చిన అనుచరులు
రాజేష్ నాయుడు మరణవార్త విన్న బైరెడ్డి అనుచరులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఆయన అకాల మరణం పట్ల స్థానిక రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

YCP Social Media Works Strongly, Will TDP Handle? | Jagan | Telugu Rajyam