ఏపీ రాజకీయం మొత్తం ప్రస్తుతం ఆలయాల చుట్టూ తిరుగుతుంది. రాష్ట్రంలో ప్రతి రోజు కూడా ఎదో ఒక మూలన ఆలయం పై దాడులు జరుగుతున్నాయి. దీనితో ఒకరిపై మరొకరు , దీనికి కారణం మీరే అంటూ విమర్శిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు , ఏపీలో ఆలయాల కూల్చివేతకు సీఎం జగన్ కారణం అంటూ పదునైన విమర్శలతో వైసీపీని ఇరుకున పెట్టాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఏపీ ప్రభుత్వం , చంద్రబాబుకి దిమ్మ తిరిగేలా షాక్ ఇవ్వాలని ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. టీడీపీ హయాంలో నాటి సీఎం చంద్రబాబు నిర్ధాక్షిణ్యంగా కూల్చిన ఆలయాలను పున: నిర్మించిచంద్రబాబు హిందూ రాజకీయాలకు విరుగుడుగా షాకివ్వాలని జగన్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.
చంద్రబాబు కూల్చిన విజయవాడలోని దేవాలయాలను మొదట నిర్మించి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని సీఎం వై ఎస్ జగన్ భావిస్తున్నాడు. ఇక చంద్రబాబు సర్కార్ హయాంలో విజయవాడ నగరంలో కూల్చివేసిన 9 దేవాలయాలకు సంబంధించి రూ.379 కోట్లతో తొలి దశలో పున: నిర్మాణ పనులకు సీఎం వైఎస్ జగన్ శుక్రవారం భూమిపూజ నిర్వహించనున్నారు. పుష్కరాల సమయంలో విజయవాడలో దక్షిణముఖ ఆంజనేయస్వామి ఆలయం సీతమ్మ వారి పాదాలు రాహు కేతువు బొడ్డుబొమ్మ గోశాల కృష్ణుడు దేవాలయాలను పునర్నిర్మిస్తామని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. వీటితో పాటు రాష్ట్రంలోని 40 వరకు కూల్చివేసిన ఆలయాలను తిరిగి నిర్మిస్తామంటున్నారు.
13 జిల్లాల్లో ఇప్పటి వరకు కూల్చివేసిన 40 ఆలయాలను తిరిగి నిర్మిస్తామని ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి తెలిపారు. ఈనెల 8న ఉదయం 11 గంటల 1 నిమిషానికి ముఖ్యమంత్రి జగన్ దుర్గ గుడి దగ్గర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. రూ.70 కోట్లతో ఆలయాల పునర్నిర్మాణ పనులు చేపడుతున్నామని అన్నారు.