ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ … పలు కీలక నిర్ణయాలకు‌ ఆమోదం !

సీఎం జగన్ అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. వెలగపూడి సచివాలయంలో చేపట్టిన ఈ సమావేశంలో అనేక ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపైనా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు, ఇతర కార్యక్రమాలపైనా మంత్రివర్గంలో చర్చ జరిగింది. దీనిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

నవరత్నాలు పథకాలపై ఈ ఏడాది క్యాలెండర్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వచ్చే ఏప్రిల్ నుంచి జనవరి వరకు పథకాల అమలుకు తీసుకున్న నిర్ణయాలను ఆమోదించింది. కేబినెట్‌ ఆమోదంతో 5.8 కోట్ల మంది లబ్ధిదారులకు అందించే పథకాల క్యాలెండర్ అమల్లోకి రానుంది. అదేవిధంగా ‘ఈబీసీ నేస్తం’ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈబీసీ మహిళలకు మూడేళ్లలో రూ.45వేల ఆర్ధిక సాయం అందనుంది. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు మహిళలకు ఈ పథకం వర్తించనుంది. పట్టణ ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లను 300 చదరపు అడుగుల లోపు ఉంటే.. రూపాయికే లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

కడప జిల్లాలో రెండు పారిశ్రామిక పార్కులకు భూకేటాయింపులపైనా ఈ సమావేశంలో చర్చించారు. కొప్పర్తిలో 598.59 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ పార్కుకు, అంబాపురంలో 93.99 ఎకరాలతో మరో ఇండస్ట్రియల్ పార్కుకు ప్రతిపాదించారు. ఈ రెండు పారిశ్రామిక పార్కులకు ఉచితంగా భూమి కేటాయింపులు జరపాలన్న అంశాన్ని చర్చించారు. ఏపీఐఐసీకి ఉచిత భూ కేటాయింపులపైనా, కడప స్టీల్ ప్లాంట్ కు 3,148 ఎకరాలు కేటాయింపుపైనా మంత్రివర్గంలో చర్చ జరిపారు. ఎకరం రూ.1.65 లక్షల చొప్పున విక్రయించాలన్న ప్రతిపాదన చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఏపీ మారిటైమ్ బోర్డుకు ఎకరం రూ.25 లక్షల చొప్పున 165 ఎకరాల భూమి కేటాయింపుపై ప్రతిపాదించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు 23 కీలక అంశాలను ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది.