ఇప్పటివరకూ ఒకలెక్క… ఇకపై మరో లెక్క!

గతకొంత కాలంగా సైలంటుగా ఉన్నట్లు కనిపించిన ఏపీ మాజీ మంత్రి నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్… తాజాగా మరోమారు వార్తల్లోకి ఎక్కారు. ఇందులో భాగంగా… ఇప్పటిదాకా చేయాల్సింది చేశారు.. ఇక నుంచి చూడండి ఎలా ఉంటుందో అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఆధ్వర్యంలో నెల్లూరు సిటీ నియోజకవర్గ ఆత్మీయ సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అవును… నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సిటీ నియోజకవర్గ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా గ్యాప్ తర్వాత అనీల్ ఇలాంటి కార్యక్రమం తలపెట్టేసరికి మీడియా అటెన్షన్ కూడా పెరిగింది. ఈ సందర్భంగా… తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మొదలుపెట్టిన అనీల్… జగనన్న తోనే తన ప్రయాణం అని స్పష్టం చేశారు.

అనంతరం… మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి దూరమయ్యానని, ఫలితంగా కొందరు తనను లక్ష్యంగా చేసుకుని ఇబ్బంది పెడుతున్నారని చెప్పిన అనీల్… “ఇప్పటిదాకా చేయాల్సింది చేశారు.. ఇక నుంచి చూడండి ఎలా ఉంటుందో” అంటూ ప్రత్యర్థులకు వార్నింగ్‌ ఇచ్చారు! ఇదే సమయంలో… 2009 లో తాను ఎమ్మెల్యే అవుతానని చెబితే చాలా మంది నవ్వారని గుర్తుచేసుకున్న అనీల్… జగనన్న సాక్షిగా ఎమ్మెల్యే, మంత్రి కూడా అయినట్లు తెలిపారు.

చనిపోయిన తన తండ్రి సాక్షిగా చెబుతున్నా.. అయ్యప్ప మాల వేస్తా.. ఎవరినీ మోసం చేయలేదు అని ఆవేశంగా మాట్లాడిన అనిల్‌ కుమార్.. డిప్యూటీ మేయర్ ఇస్తానని ద్వారకాకు మాట ఇచ్చిన అనంతరం తనపై ఎంతో ఎంతో ఒత్తిడి వచ్చినప్పటికీ… మాట తప్పలేదని అన్నారు. తాజాగా అనీల్ చేసిన వ్యాఖ్యలు నెల్లూరు లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఇంతకాలం కాస్త సైలంట్ గా ఉన్న అనీల్.. ఇకపై మళ్లీ ఫాం లోకి వచ్చేలా కనిపిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి!