దసరా ఉత్సవాల్లో ఏడవ రోజైన మంగళవారంనాడు ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న జగన్మాత కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీమహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితేః
శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే
మంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మీదేవి, దుర్గాసప్తశతి అంతర్గతమైన దేవి ఆదిపరాశక్తి మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతి అనే రూపాలను ధరించి దుష్టరాక్షస సంహారాన్ని చేశారు. మూడుశక్తుల్లో ఒక శక్తి అయిన మహాలక్ష్మీ అమితమైన పరాక్రమాన్ని చూపించి మహిషుడనే అసురుణ్ణి సునాయాసంగా సంహరించి మహిషమర్దినిగా ప్రసిద్ధి పొందింది.
లోక స్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మీ సమిష్టి రూపమైన అమృతస్వరూపిణిగా దుర్గమ్మ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు.
