15 ఏళ్ళు జగనే సిఎం

మరో 15 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారంటూ సినీ నటుడు గిరిబాబు సంచలన జోస్యం చెప్పారు. చంద్రబాబునాయుడు నాయకత్వంలో టిడిపి భూస్ధాపితం అయిపోయిందన్నారు. తన రక్తంలోనే టిడిపి ఉందని చెప్పిన ఈ సీనియర్ నటుడు ప్రస్తుతం తాను మాత్రం టిడిపిలో లేనన్నారు.

తెలుగుదేశంపార్టీ బతికి బట్టకట్టాలంటే జూనియర్ ఎన్టీయార్ వల్లే సాధ్యమవుతుందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. టిడిపి పుంజుకోవాలంటే పార్టీ పగ్గాలు జూనియర్ చేపట్టక తప్పదంటూ జోస్యం చెప్పారు. తాను ఈ విషయాన్ని ఇపుడు చెప్పటం కాదని గతంలో కూడా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.

జూనియర్ కు పార్టీలో సముచితమైన స్ధానం ఇవ్వకుండా తప్పు చేస్తున్నట్లు మండిపోయారు. అయినా జూనియర్ కు టిడిపిలో ఒకరిచ్చేదేంటి సముచిత స్ధానం అంటూ ఎదురు ప్రశ్నించారు. చంద్రబాబు ఐదేళ్ళు ప్రజలకు ఏమీ మంచి చేయకపోగా అన్యాయమైన పాలనతో జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయిందన్నారు.

జగన్ కు జనాలు అఖండ మెజారిటి ఇవ్వటాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నట్లు చెప్పారు. దాంతో ప్రతి చిన్న విషయానికి నానా రాద్దాంతం చేస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.  ఎన్టీయార్, వైఎస్సార్ తర్వాత జనరంజక పాలన చేయగలిగింది జగన్ మాత్రమే అని గిరిబాబు చెప్పారు.