ఫైర్ బ్రాండ్స్ కేబినెట్ లోకి ఎంట్రీ !

TDP blaming YS Jagan's publicity

సీఎంగా జగన్ గద్దెనెక్కగానే ఫైర్ బ్రాండ్ లు, దూకుడు గల ఎమ్మెల్యేలను పక్కనపెట్టి సామాజిక కోణంలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. అయితే మొదట్లో అది జగన్ కు పేరు తీసుకొచ్చినా దూకుడైన నేతలు లేక కేబినెట్ వెలవెలబోతోంది. ప్రస్తుతం ఉన్న మంత్రులంతా సాప్ట్ గా ఉంటున్నారు. దీంతో వారు ప్రతిపక్షాలను కాచుకోవడం లేదన్న ఆవేదన వైసీపీ అధిష్టానంలో వ్యక్తమవుతోంది. నిజానికి ఇప్పుడున్న మంత్రివర్గంలో చాలా మంది మంత్రులకు నోట్లో నాలుక లేనట్టే ప్రవర్తిస్తున్నారు. ఖచ్చితంగా మంత్రి పదవి ఖాయమనుకున్న వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేలు రోజా, అంబటి రాంబాబు, స్పీకర్ తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాద్ రావు, కరుణాకర్ రెడ్డి లాంటి వారికి మంత్రి పదవులు లభించలేదు.

దీంతో వారంతా పదవులు లేక మౌనంగా ఉండిపోతున్నారు. ఇక మంత్రి పదవులు దక్కిన వారంతా పెద్దగా నోరు విప్పడం లేదు. సీఎం జగన్ ప్రస్తుతం ఖాళీ అయిన రెండు మంత్రి పదవులతోపాటు కొత్తగా కేబినెట్ ను విస్తరించబోతున్నారనే ప్రచారం మొదలైంది. దూకుడైన నేతలను మంత్రివర్గంలోకి తీసుకుంటారని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫైర్ బ్రాండ్ స్పీకర్ తమ్మినేనికి ఈసారి మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం సాగుతోంది. తమ్మినేనితోపాటు రోజా, అంబటి రాంబాబు, ఆళ్ల రామకృష్ణారెడ్డి సహా వైసీపీ తరుఫున బాగా వాయిస్ వినిపించే వారికి జగన్ మంత్రి పదవులు ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది.

పర్ఫామెన్స్ ఆధారంగా ఈసారి మంత్రి పదవులు కేటాయిస్తారని.. స్తబ్దుగా ఉన్నవారిని తొలగిస్తారనే ప్రచారం మొదలైంది. జగన్ దూకుడుకు ప్లస్ అయ్యేవారిని కేబినెట్ లోకి తీసుకోబోతున్నారని సమాచారం. ఈనెల చివరి వారంలో జగన్ కేబినెట్ విస్తరణ ఉండబోతోందని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో ఫైర్ బ్రాండ్స్ కేబినెట్ లోకి ఎంట్రీ అయ్యి ప్రతిపక్ష టీడీపీని చెడుగుడు ఆడే ప్లాన్ ను జగన్ రూపొందించినట్టు తెలుస్తోంది.