పుబ్బలో పుట్టి మఖలో అస్తమించుతున్న బిజెపి పవన్ కళ్యాణ్ పొత్తు?

BJP and Jansena Alliance

జనసేన అధినేత ఎవరితో పొత్తు పెట్టుకున్నా మూన్నాల్ల ముచ్చటగా మిగులు తోంది. పవన్ కళ్యాణ్ పరిభాషలోనే చెప్పాలంటే నెలల తరబడి చర్చలు జరిగిన తర్వాత బిజెపి జనసేన మధ్య ఏర్పడిన పొత్తుకు బీటలు వారినట్లు జరుగుతున్న పరిణామాలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం ఎవరికి వారుగా వున్నారు.

పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లక ముందే అమరావతి రాజధానికి అనుకూలంగా కవాతు ప్రకటించారు. ఇంకేముంది? అని భావించిన వారు లేక పోలేదు. తుదకు కవాతు వాయిదా పడింది. పోనీ తర్వాత నైనా రెండు పార్టీలు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమం లేదు. అసలు విషయమేమంటే అమరావతి రాజధానిని కాపాడుకొనేందుకే తాను బిజెపితో కలుస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటన చేయడం గమనార్హం.అది నేడు గాలిలో దీపమైంది.

రెండు పార్టీలు సంయుక్తంగా ఎట్టి కార్యక్రమం నిర్వహించక పోగా బిజెపి జాతీయ అధికార ప్రతినిధి నర్సింహారావు రాజధాని అంశంలో మొత్తంగా గాలి తీసేశారు. పవన్ కళ్యాణ్ నోరెత్త లేని విధంగా ప్రకటన చేశారు. రాజధాని మార్పు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్వతంత్రం వుందని తేల్చేశారు. కేంద్రం జోక్యం చేసుకొనే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రకటనపై ఇంత వరకు వీర తాళ్లు వేసుకున్న రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ లాంటి వారు కుక్కిన పేనుల్లా వుండి పోవడంతో పవన్ కళ్యాణ్ పరిస్థితి రెండింటికి చెడిన రేవడిలా తయారైంది.

ఇదే కాదు. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టిడిపి బిజెపితో జట్టు కట్టారు. తర్వాత టిడిపి అవినీతి మయం అని బిజెపి పాచి పోయిన లడ్డు ఇచ్చిందని ఎన్నికల్లో వామపక్షాలతో జట్టు కట్టారు. అదీ వికటించింది. ఎన్నికల తర్వాత వైసిపి ప్రభుత్వాన్ని కూలదోయడమే లక్ష్యంగా ఆగ్రహావేశాలతో ప్రకటనలు చేశారు. ఫలితంగానే బిజెపితో జట్టు కట్టక తప్పదని హోం మంత్రి అమిత్ షా లాంటి వారు అవసరమని ఉద్ఘాటించారు. ఇప్పుడు అంతా భ్రాంతిగా మిగిలి పోయింది. తుదకు అమరావతి రైతులకు అండగా ఈ నెల 10 వతేదీ తర్వాత పర్యటన పెట్టుకున్నారు.