పవన్ ని కలిసిన డైరక్టర్ క్రిష్, అసలు స్కెచ్ ఏంటి?

క్రిష్ తో సినిమా పవన్ చేస్తారా లేక వేరే ప్లానింగా?

పవన్ కళ్యాణ్ తాను సినిమాల్లోకి రానని చెప్తున్నా ఆయనతో ఎలాగైనా సినిమా చెయ్యాలనుకుని ప్రయత్నించేవాళ్లు ఆగటం లేదు. ప్రముఖ నిర్మాత ఎ.ఎమ్ రత్నం గతంలో పవన్ కు అడ్వాన్స్ ఇచ్చి ఉండటంతో వీరి కాంబినేషన్ లో పవన్ సినిమా చెయ్యాల్సి ఉంది. దాంతో ఆయన ఈరోజు ప్రముఖ దర్శకుడు క్రిష్ ని తీసుకుని పవన్ ఇంటికి వెళ్లారని సమాచారం.

గతంలో ఆగిపోయిన సత్యాగ్రహి తరహాలోనే ఓ విప్లవ వీరుడు కథతో క్రిష్ ఓ కథని రెడీ చేసి వినిపించారని చెప్తున్నారు. అయితే పవన్ ఏం చెప్పారన్నది మాత్రం తెలియరాలేదు. దాంతో పవన్ ఎలాగో మళ్లీ ఎలక్షన్స్ వరకూ పొలిటికల్ గా పెద్ద ప్రెజర్ ఉండదు కాబట్టి సినిమా ద్వారా మరోసారి జనాల్లోకి వెళ్లే అవకాసం ఉందని అంటున్నారు. అయితే ఆయన అభిమానులు మాత్రం అలాంటిదేమీ లేదని ఆయన సినిమాలు చేయరని చెప్తున్నారు.

మరో ప్రక్క సినిమా కోసం క్రిష్ , పవన్ కలవలేదని … బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో రూపొందించిన ‘సత్యమేవ జయతే’ తరహాలో ఈటీవి కోసం ఓ పోగ్రాం గతంలో అనుకుని ఆపేసారు. అయితే ఇప్పుడు మరోసారి జనాల్లోకి వెళ్లేందుకు అలాంటి పోగ్రాంతో ముందుకు వస్తే ఎలా ఉంటుందని ఆలోచనతో క్రిష్ కలిసారని అంటున్నారు.

సామాజిక అంశాలను తన చిత్రాలలో మేళవించే క్రిష్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా టాక్. మరి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో లేదో గానీ, ట్రేడ్ వర్గాలు మాత్రం ఈ పోగ్రామ్ లో పవన్ నటిస్తున్నట్లుగా ఖరారు చేసేస్తున్నాయి. ఇదే జరిగితే రాజకీయంగా ‘జనసేన’ను ప్రజల్లోకి తీసుకెళ్ళే మంచి అవకాశం పవన్ కళ్యాణ్ కు లభించినట్లవుతుంది.