పవన్ కూడా ఆ పోరాటంలో పాల్గొనబోతున్నారా?

గంగా ప్రక్షాళన పోరాట యాత్రలో పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ హరిద్వార్‌లోని మాత్రి సదన్ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆధ్యాత్మిక గురువు, గంగా ప్రక్షాళన కోసం అసువులు బాసిన ప్రొ. జి.డి. అగర్వాల్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వెన్నునొప్పి బాధ ఇంకా తగ్గనప్పటికీ మాత్రి సదన్‌కు వెళ్లి అగర్వాల్ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా దేశంలోని నదులను కాపాడుకోవాలని పవన్ పిలుపునిచ్చారు.

పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. పవిత్ర గంగా నదిని కాలుష్యానికి గురిచేయడమంటే మన సంస్కృతిని కలుషితం చేయడమేనని అన్నారు. గంగా ప్రక్షాళన పోరాటం దీనికి నాంది కావాలని పిలుపునిచ్చారు. తాను పోరాటయాత్రలో ఉండగా జీడీ అగర్వాల్‌ మరణవార్త తెలిసిందని, ఒక మహత్తర కార్యక్రమం కోసం ఆయన ప్రాణాలు అర్పించడం నన్నెంతో కలిచివేసిందని ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ఆ రోజునే తాను హరిద్వార్‌కు వచ్చి అగర్వాల్‌ పార్ధీవదేహానికి నివాళులు అర్పిద్దామనుకున్నానని, అయితే పోరాట యాత్ర వల్ల రాలేకపోయానని తెలిపారు.


ఇక రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత, వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరొందిన రాజేంద్రసింగ్‌ ఇటీవల హైదరాబాద్‌లో జనసేన పార్టీ కార్యాలయాన్ని సందర్శించి పవన్‌ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. సమావేశంలో భాగంగా అగర్వాల్‌ వర్థంతి కార్యక్రమానికి హాజరుకావాలని పవన్‌ కల్యాణ్‌ను కోరారు. దీంతో పవన్‌ కల్యాణ్‌ హరిద్వార్‌ వెళ్లారు.

గురువారం సాయంత్రం డెహ్రడూన్‌కు చేరుకున్న జనసేనాధిపతి అక్కడి నుంచి హరిద్వార్‌ దగ్గరలోని మాత్రి సదన్‌ ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ గురూజీ స్వామి శివానంద మహరాజ్‌, రాజేంద్రసింగ్‌లు పవన్‌ కల్యాణ్‌ను సాదరంగా ఆహ్వానించారు. గంగా నదిని పరిశ్రమలు, ప్రభుత్వాలు ఏ విధంగా కలుషితం చేస్తున్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌కు ఆశ్రమ గురూజీ శివానంద మహారాజ్‌ వివరించారు.

పవన్‌ కల్యాణ్‌ గురించి, ఆయన పోరాట స్ఫూర్తి గురించి తాను తెలుసుకున్నానని, గంగా ప్రక్షాళన పోరాట యాత్రకు ఆయన బాసట కావాలని కోరినట్లు శివానంద మహారాజ్‌ తెలిపారు. దక్షిణాది నుంచి గంగా పక్షాళన పోరాటానికి తగినంత మద్దతు లభించడం లేదని, పవన్‌ కల్యాణ్‌ దానిని భర్తీ చేయాలని ఆయన కోరారు.

వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌ మాట్లాడుతూ.. జీడీ అగర్వాల్‌లో ఉన్న పోరాట స్ఫూర్తిని తాను పవన్‌ కల్యాణ్‌లో చూశానని పేర్కొన్నారు. గంగా ప్రక్షాళన కోసం పవన్‌ కల్యాణ్‌ కూడా గట్టి కృషి చేయాలని ఆయన కోరారు.

మొదట పవన్‌ కల్యాణ్‌ గంగా ప్రక్షాళన కోసం 115 రోజులు నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన స్వామి నిగమానంద సరస్వతి సమాధిని సందర్శించి అంజలి ఘటించారు. అనంతరం గంగా నది వద్ద జరిగిన హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మాత్రి సదన్‌ ఆశ్రమాన్నే కేంద్రంగా చేసుకొని జీడీ అగర్వాల్‌ గంగా ప్రక్షాళన పోరాటం జరిపారు.