జగన్ ను కాపీ కొడుతున్న ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా తన భుజాన్ని తానే చరుకుకునే చంద్రబాబునాయుడు ఆచరణలో మాత్రం నాలుగు పదుల వయస్సున్న జగన్మోహన్ రెడ్డిని కాపీ కొడుతున్నారు. పార్టీ అనుబంధ సంఘాల్లో మహిళలు, బడుగు, బలహీన వర్గాలు, యువతకు ప్రాముఖ్యత ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించటంతో జగన్ ను కాపీ కొడుతున్న విషయం అర్ధమైపోతోంది.

మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీకి  ఘోర పరాజయం ఎదురైన విషయం తెలిసిందే. ఆ దెబ్బ నుండి చంద్రబాబు ఇంకా కోలుకోలేకపోతున్నారు. దాంతో పార్టీకి పూర్వ వైభవం ఏ విధంగా తేవాలన్న అన్న విషయాన్ని తేల్చుకోలేకపోతున్నారు. సరిగ్గా ఇక్కడే చంద్రబాబుకు కాపీ మార్గమే  శరణ్యమైంది.

దశరా పండుగ నుండి పార్టీకి పూర్వవైభవం తెచ్చే కసరత్తు మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఆ కసరత్తు కూడా పార్టీ అనుబంధ సంఘాలను భర్తీ చేయటంతో శ్రీకారం చుట్టాలని డిసైడ్ అయ్యారు.  ఇందులో బడుగు, బలహీన వర్గాలు, మహిళలు, యువతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.

జగన్ అధికారంలో నుండి వచ్చిన దగ్గర నుండి మహిళలు, మైనారిటిలు, ఎస్సీ, ఎస్టీ, కాపులకు పెద్ద పీట వేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే.  5 లక్షల రూపాయల లోపు నామినేషన్ పనులన్నీ వారికే ఇవ్వాలని నిర్ణయించారు. దేవాలయాల్లాంటి పాలక మండళ్ళల్లో కూడా వాళ్ళకే 50 శాతం రిజర్వేషన్ కల్పించారు.

ఇటువంటి చర్యలతో ప్రజల్లో జగన్ పై బాగా సానుకూలత కనిపిస్తోంది. తాను అధికారంలో ఉండగా పై వర్గాలకు పెద్దగా ప్రధాన్యత ఇవ్వని చంద్రబాబు ఓడిపోయిన తర్వాత మాత్రం పార్టీలోను అనుబంధ సంఘాల్లో పెద్ద పీట వేయాలని నిర్ణయించటమే విచిత్రంగా ఉంది.