కేసీఆర్, జగన్‌కు 14వేల కోట్లు ఆఫర్ చేసిన కేఏ పాల్!

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మత ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. కరోనాతో పోరాటం చేస్తోన్న తెలుగు రాష్ట్రాలకు 7 వేల కోట్లు చొప్పున మొత్తం 14 వేల కోట్ల రూపాయలు విరాళ రూపంలో తెస్తానని అన్నాడు. అయితే అందుకు కేసీఆర్, జగన్ ఇద్దరూ చెరో లెటర్ రాసి ఆయన చేతిలో పెట్టాలట.

ప్రపంచ స్థాయిలో పేరుగాంచిన ప్రబోధకుడిగా నిత్యం తన గురించి తాను చెప్పుకునే పాల్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోని అనేక దేశాల ప్రధానులు, మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఇలా ప్రతి ఒక్కరినీ తానే ముందుండి నడిపించానని చెబుతారు. తాను ప్రచారం చేస్తేనే ట్రంప్ గెలిచారని కూడా అన్నారు. అలాగే మోదీని కూడా వదలలేదు. హోం మంత్రి అమిత్ షా కూడా తన కోసం ఎదురు చూస్తారు అని చెప్తారు. ఆ వ్యాఖ్యల సంగతి ఎలా ఉన్నా తాజాగా కేఏ పాల్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

కరోనా బాధితుల సహాయార్థం ఏంత విరాళం ఇస్తారని ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ‘నా అకౌంట్ నుండి ఇస్తే ఎంత ఇవ్వగలను? అదే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివిధ దేశాల ప్రధానులను, అధ్యక్షులను సాయం కోరుతున్నట్లు చెరో లెటర్ ఇస్తే.. వాటిని తీసుకెళ్లి రెండు రాష్ట్రాలకు 14 వేల కోట్లు విరాళం తీసుకొస్తాను’ అన్నారు. పైగా జగన్, కేసీఆర్ ఎవరికీ తెలియదు కాబట్టి.. తనను చూసి ఆ నిధులు ఇస్తారని చెప్పుకొచ్చారు. ఇలా ఆఫర్లు ఇవ్వడం కేఏ పాల్‌కు కొత్త కాకపోయినా.. వీటికి స్పందించే వారే లేరు మరి.

గతంలో కూడా.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా.. కేఏ పాల్ ఇలాంటి ఆఫర్ ఓకటి ఇచ్చారు. జగన్‌ ఒప్పుకుంటే అతనితో కలిసి పనిచేస్తానని అన్నాడు. ఆ మేరకు జగన్ దగ్గరకు తన స్నేహితులను కూడా పంపాడట. పైగా ముఖ్యమంత్రి ఎవరన్నది కాదు.. రాష్ట్ర అభివృద్ధి కోసం సమిట్‌లు పెట్టి మిలియనీర్లను, బిలియనీర్లను కూడా తెస్తా అంటూ వ్యాఖ్యలు చేశారు.