Justice Lisa Gill: ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థలో ఒక చారిత్రాత్మక అధ్యాయం మొదలైంది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ బుధవారం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ హైకోర్టు చరిత్రలో ఒక మహిళా న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి (Chief Justice) పదవిని చేపట్టడం ఇదే తొలిసారి.
నేడు బాధ్యతల స్వీకారం ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24న పదవీ విరమణ చేసిన నేపథ్యంలో, జస్టిస్ లీసా గిల్ ఏప్రిల్ 25న (గురువారం) బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 26న సుప్రీంకోర్టు కొలీజియం ఆమె పేరును సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే.
న్యాయ రంగంలో జస్టిస్ లీసా గిల్కు 36 ఏళ్లకు పైగా విశేష అనుభవం ఉంది. మాజీ న్యాయమూర్తి హర్ఫూల్ సింగ్ బ్రార్ కుమార్తె అయిన ఈమె, పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి బీఏ ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా ప్రస్థానాన్ని ప్రారంభించి.. క్రిమినల్, సివిల్, సర్వీస్, రెవెన్యూ మరియు రాజ్యాంగ పరమైన కేసుల్లో నిష్ణాతులుగా పేరు తెచ్చుకున్నారు.

మార్చి 2014లో పంజాబ్-హర్యానా హైకోర్టు బెంచ్లో న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అక్కడ 11 ఏళ్ల పాటు సేవలందించిన ఆమె, గత నెలలోనే ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు.
ప్రముఖుల అభినందనలు: జస్టిస్ లీసా గిల్ నియామకంపై ఏపీ రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
“ఉన్నత న్యాయవ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంపొందించే దిశగా ఇదొక చారిత్రాత్మక ఘట్టం. జస్టిస్ లీసా గిల్ తన విజ్ఞతతో, చిత్తశుద్ధితో చట్టబద్ధమైన పాలనను కాపాడుతూ విజయవంతమైన పదవీకాలాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను.” అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు.
అదేవిధంగా మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ.. ఏపీ న్యాయవ్యవస్థకు ఇది గర్వకారణమైన విషయమని పేర్కొంటూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

