Petrol Bunk No Stock: ఆంధ్రప్రదేశ్లో ఇంధన కొరత తీవ్రరూపం దాల్చింది. రాష్ట్రవ్యాప్తంగా వందలాది పెట్రోల్ బంకులు ‘నో స్టాక్’ బోర్డులు పెట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా డిమాండ్ పెరగడం, సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో పలు నగరాల్లో బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో సాధారణంగా రోజుకు 6,330 కిలోలీటర్ల పెట్రోల్, 9,048 కిలోలీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతుంటాయి. అయితే, తాజా పరిస్థితుల వల్ల స్టాక్ గంటల్లోనే ఖాళీ అవుతోంది. ప్రధానంగా అంబులెన్సులు, అత్యవసర వైద్య సేవలు, వ్యవసాయ పనులకు ఇంధనం దొరకకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఎన్హెచ్ఆర్సీ (NHRC) లో ఫిర్యాదు
ఈ సంక్షోభంపై తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)కు ఫిర్యాదు చేశారు. అంబులెన్సులకు కూడా డీజిల్ దొరకని పరిస్థితి నెలకొనడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును హరించడమేనని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

పెట్రోల్ బంకుల్లో అక్రమ నిల్వలు, కృత్రిమ కొరతను అరికట్టేందుకు ‘ఆటోమేటిక్ ట్యాంక్ గేజింగ్’ వ్యవస్థను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా వారీగా అందుబాటులో ఉన్న నిల్వల వివరాలను ప్రజలకు తెలిసేలా రియల్ టైమ్ పోర్టల్ ఏర్పాటు చేయాలని కోరారు.
కేంద్ర పెట్రోలియం శాఖ, సుప్రీంకోర్టు లీగల్ సెల్ మరియు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేతిరెడ్డి వినతిపత్రాలు అందజేశారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో తక్షణమే సమీక్ష నిర్వహించి, సరఫరాను పునరుద్ధరించాలని, బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడే బంకులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

