అన్ స్టాపబుల్ సీజన్ 2 లో సందడి చేయనున్న మాజీ ముఖ్యమంత్రి…?

నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోకి ఉన్న ప్రేక్షకాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రముఖ తెలుగు ఓటిటి ఛానల్ ఆహా వేదికగా ప్రసారమైన అన్ స్టాపబుల్ మొదటి సీజన్ మంచి హిట్ అయింది. దీంతో ఇటీవల అన్ స్టాపబుల్ సీజన్ 2 ని కూడా ప్రారంభించారు. ఇక ఈ సీజన్ 2 లో బాలకృష్ణ మరింత ఉత్సాహంగా షో రక్తి కట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో తనలోని మరొక కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ షో కి వచ్చిన అతిధులను తన ప్రశ్నలతో తికమక పెట్టడమే కాకుండా తన మీద తాను సెటైర్లు వేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

ఇటీవల ప్రారంభమైన ఈ అన్ స్టాపబుల్ సీజన్ 2 లో ఇప్పటికే మూడు ఎపిసోడ్లు పూర్తి అయ్యాయి. మొదటి ఎపిసోడ్ లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో పాటు అతని తనయుడు నారా లోకేష్ సందడి చేశారు. ఇక రెండవ ఎపిసోడ్లో టాలీవుడ్ కుర్ర హీరోలైన విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ హాజరయ్యారు. ఇక ఈ ఎపిసోడ్లో బాలకృష్ణ కుర్రాడిలా మారిపోయి కుర్ర హీరోలతో కలిసి తెగ సందడి చేశాడు. ఇక మూడవ ఎపిసోడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అయిన శర్వానంద్, అడవి శేష్ అతిధులుగా హాజరయ్యారు. ఇక వీరిద్దరికి తనదైన శైలిలో ప్రశ్నలు వేస్తూ వారిని తికమక పెడుతూ ఒక ఆట ఆడుకున్నారు. వారు కూడా బాలయ్య మీద సెటైర్లు వేసినా కూడా బాలయ్య చాలా స్ఫూర్తిగా తీసుకుంటూ సందడి చేశాడు.

ప్రస్తుతం నాలుగవ ఎపిసోడ్ కి హాజరు కాబోతున్న అతిధి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం… అన్ స్టాపబుల్ సీజన్ 2 నాలుగవ ఎపిసోడ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అతిథిగా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. బాలయ్యకు, కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య మంచి స్నేహ బంధం ఉంది. వీరిద్దరూ కలిసి ఒకే స్కూల్ లో చదువుకున్నారు.అందువల్ల చిన్నప్పటి నుండి వీరి మద్య మంచి స్నేహ బంధం ఉంది. ఇక ఈ నాల్గవ ఎపిసోడ్ లో కిరణ్ కుమార్ రెడ్డి అతిథిగా హాజరైతే బాలయ్య .. కిరణ్ కుమార్ రెడ్డి మద్య జరిగే సంభాషణ ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు .