జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగబాబు…?

మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించి నటుడిగా కూడా నాగబాబు మంచి గుర్తింపు పొందాడు. అంతేకాకుండా సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. అయితే నిర్మాణ రంగంలో నష్టాలు చవిచూడటంతో నిర్మాణ రంగానికి దూరంగా ఉంటున్నాడు. ఇలా నిర్మాతగా సక్సెస్ కాలేకపోయినా కూడా నటుడిగా మాత్రం మంచి గుర్తింపు పొందాడు. ఇక ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో కి జడ్జిగా కూడా వ్యవహరించి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు.

2013లో ప్రారంభమైన జబర్దస్త్ కామెడీ షోకి మొదటగా నాగబాబు, రోజా జడ్జిలుగా వ్యవహరించారు. ఈ కామెడీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యి.. నటుడిగా కంటే జడ్జిగానే బాగా పాపులర్ అయ్యారు. ఈ జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా తమ కెరీర్ ప్రారంభిస్తే నాగబాబు, రోజా కూడా జడ్జిలుగా తమ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇలా జబర్దస్త్ జడ్జిగా దాదాపు ఐదేళ్లపాటు ప్రేక్షకులను అలరించాడు. అయితే మల్లెమాల వారితో నాగబాబుకి మనస్పర్ధలు రావడం వల్ల జబర్దస్త్ కి దూరం అయ్యి.. మాటీవీలో ప్రసారమవుతున్న టీవీ షోస్ లో జడ్జిగా వ్యవహరించాడు.

అయితే జబర్దస్త్ కామెడీ షోకి దీటుగా ఏ కామెడీ షో కూడా నిలవలేకపోయింది. దీంతో మాటీవీలో ప్రసారమవుతున్న కామెడీ షోలు కొంతకాలానికే మూతపడ్డాయి. ప్రస్తుతం నాగబాబు చేతిలో ఒక్క టీవీ షో కూడా లేదు. ఇదిలా ఉండగా ఇటీవల జబర్దస్త్ రీ ఎంట్రీ గురించి నాగబాబుని ప్రశ్నించగా…జబర్దస్త్ తో తనకు ఎలాంటి గొడవ లేదని, మల్లెమాల వాళ్లతో కొంతమంది కమెడియన్స్ కి ఇబ్బందులు వచ్చినప్పుడు వారికోసం నేను బయటకు వచ్చేసాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు మళ్లీ మల్లెమాల వాళ్లు పిలిచి అవకాశం ఇస్తే తప్పకుండా వెళ్లి జబర్దస్త్ జడ్జ్ గా చేస్తాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. అయితే మల్లెమాలవారు నాగబాబుని తిరిగి జబర్దస్త్ కి ఆహ్వానిస్తారా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.