శ్రీదేవి డ్రామా కంపెనీ రేటింగ్ తగ్గటానికి ఆ చానల్స్ కారణమా..?

ప్రేక్షకులని ఆకట్టుకోవడానికి టీవి ఛానల్స్ వారు ఎన్నొ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కామెడీ షో లు, డాన్స్ షోస్ తో పాటు వివిధ రకాలుగా ఈవెంట్ లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇలా బుల్లితెర మీద ప్రసారమవుతున్న జబర్థస్త్ కామెడీ షో ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో అందరికీ తెలిసిందే. గత తొమ్మిది సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతున్న ఈ షో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ షో కి మంచి రేటింగ్స్ రావటంతో ఇతర చానల్స్ వారు కూడా ఇలాంటి కామెడీ షోస్ ప్రారంభించారు. కానీ జబర్థస్త్ కి పోటీగా ఏ కామెడీ షో నిలబడలేకపోయింది.

కొంతకాలం క్రితం శ్రీదేవీ డ్రామా కంపెనీ పేరుతో ఈటీవిలో మరొక కామెడీ షో ప్రారంభించారు. ఈషో కూడా మంచి రేటింగ్స్ తో దూసుకుపోతోంది. ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ కామెడీ షో కి మొదట సుధీర్ యాంకర్ గా వ్యవహరించే వాడు. కానీ మాటీవిలో సుధీర్ కి అధిక రెమ్యునరేషన్ ఆఫర్ రావటంతో జబర్థస్త్ తో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో కూడా కనిపించటం లేదు. దీంతో సుధీర్ స్థానంలో రష్మి యాంకర్ గా కొనసాగుతోంది. ఈ షో నుండి సుధీర్ వెళ్లినప్పటికీ మంచి రేటింగ్స్ అందుకుంటోంది.

కానీ గత మూడు వారాలుగా శ్రీదేవీ డ్రామా కంపెనీ షో రేటింగ్స్ తగ్గిపోయాయని ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ షో రేటింగ్స్ తగ్గిపోవటానికి కారణం జీ తెలుగు, మా టీవీలో ప్రసారమవుతున్న స్పెషల్ కార్యక్రమాలేనని తెలుస్తోంది. ఈ స్పెషల్ ఈవెంట్స్ వల్ల శ్రీదేవీ డ్రామా కంపెనీ షో రేటింగ్స్ పడిపోవడంతో మల్లెమాల వారు ఆందోళన చెందుతున్నారని సమాచారం. ఇప్పటికే ఆది, సుధీర్ వంటి వారు జబర్థస్త్ నుండి బయటికి వెళ్లిపోవడంతో జబర్థస్త్ రేటింగ్స్ తగ్గిపోయాయి. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీకి వస్తున్న రేటింగ్స్ మల్లెమాల వారికి కొంత ఊరట లభించింది. ఇక ఇప్పుడు ఈ షో రేటింగ్స్ పడిపోవడంతో మల్లెమాల వారు కొంత ఆందోళన చెందుతున్నారు. అయితే జీ తెలుగు, మాటీవీలో ప్రసారమవుతున్న ఈ స్పెషల్ ఈవెంట్స్ తాత్కాలికం కాబట్టి వచ్చేవారంలో శ్రీదేవి డ్రామా కంపెనీ రేటింగ్స్ పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.